శక్కర్నగర్, ఫిబ్రవరి 28: అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టే హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని, అన్ని హామీలను నెరవేరిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం రాత్రి బోధన్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన విషయంపై అసలు ఎక్కడా ఊసెత్తడం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ, పలు దాడులు జరిగినా స్పందించడం లేదన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి తదితరులు పాల్గొన్నారు.