నిజామాబాద్: సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ కర్షకులకు ఎనలేని లాభం వస్తుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రూ.వేల కోట్లు వెచ్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాన్ని అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పంటల సీజన్కు వరి సేకరణపై ఆంక్షలు పెడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందడుగు వేయడం గొప్ప విషయమన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార, పోలీసు, రవాణా, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీ వీజీగౌడ్, కలెక్టర్ నారాయణ రెడ్డిలతో కలిసి ధాన్యం సేకరణపై చర్చించారు.
యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ధాన్యం కొనుగోళ్లను చేపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. వరి పంట చేతికొస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అవసరానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవాలని యంత్రాంగాన్ని వేముల ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న కర్నాటక రాష్ట్రంలో వరి ధాన్యాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని రూ.వేల కోట్లు నిధులు సమకూర్చుకుని రైతులు పండించిన ప్రతి గింజను సేకరిస్తుండటంతో గొప్ప విషయమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కడ్తా పేరుతో రైతులను హింసిస్తే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లకు మంత్రి హెచ్చరించారు. ధాన్యం రవాణా చేసే సమయంలో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు.