కామారెడ్డి/సుభాష్నగర్, ఏప్రిల్ 10: నెలవంక మెరిసింది. రంజాన్ పండుగ వచ్చేసింది. పుణ్యఫలాల పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో ముగిశాయి. నెల రోజులపాటు కఠోర ఉపవాసం చేసిన ముస్లింలు బుధవారం సాయంత్రం దీక్షలు విరమించి గురువారం ఈద్-ఉల్-ఫితర్ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని మసీదులు, ఈద్గాలను ముస్లిముల సామూహిక ప్రార్థనల కోసం ముస్తాబు చేశారు.
రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్థనలకు మసీదులు, ఈద్గాల వద్ద మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరంలోని గాంధీచౌక్ సమీపంలో ఉన్న కచియా మసీదులో ఉదయం 8 గంటల నుంచి, ఖిల్లా ప్రాంగణంలోని జామా మసీదులో 8.30 నుంచి సామూహిక ప్రార్థనలు ప్రారంభించనున్నట్లు ముస్లిం మతపెద్దలు వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని కోర్టు వద్ద ఉన్న దర్గా వద్ద మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.