సదాశివనగర్, జనవరి 28: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దుతానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సదాశివనగర్ మండలంలోని మర్కల్ గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, తండాలకు నిధులు తీసుకొచ్చి రోడ్లు, మురికి కా ల్వలను నిర్మిస్తామన్నారు. మర్కల్లో రూ. 25లక్షలతో సీసీ రోడ్లు, మురికి కాల్వల సీసీ కోసం రూ.10 లక్షలతో పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. చెరువు కట్టపై పనుల కోసం జీపీ నిధులు రూ. లక్షా50 వేలతో పనులు చేస్తామన్నారు.
త్వరలో 200 యూనిట్ల ఉచిత కరెంట్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారానికి తన వద్దకు నేరుగా రావాలని, లీడర్లతో రావొద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జూకంటి సంగారెడ్డి, ఉప సర్పంచ్ రాజు, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు లింగాగౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాగ య్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.