వర్ని, ఏప్రిల్ 27 : ఆరు గ్యారెంటీలను కేవలం వంద రోజుల్లో అమలుచేస్తామని హామీ ఇచ్చి.. అమలుచేయని కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓట్లడిగే అర్హత లేదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి శనివారం రాత్రి రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. రైతులకు కనీసం సాగు నీరందించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు.
కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, రైతుబంధు ఇవ్వకుండా రైతులను అప్పులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, వర్ని జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, మండల కో-ఆప్షన్ సభ్యుడు కరీం, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్, సింగంపల్లి గంగారాం, రంజ్యానాయక్, పండరి, రాజు, నరెడ్ల శ్రీను, దిలారి బాబు తదితరులు పాల్గొన్నారు.