నస్రుల్లాబాద్/బాన్సువాడ, మే 4: అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ను కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. శనివారం ఆయన నస్రుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడలో నిర్వహించిన రోడ్షో, కార్నర్ మీటింగ్లో జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లోపు బిల్లులు రాకపోతే ఈ నెల 13న పోలింగ్ తర్వాత తన కుటుంబ సభ్యులు, లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తానని స్పష్టం చేశారు.
అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. పేదల కోసం ఎంతవరకైనా పోరాడుతానని అన్నారు. నియోజకవర్గంలో 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరుచేయగా..10వేల ఇండ్లు పూర్తయినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు రూ.400 కోట్ల బిల్లులు ఇప్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న రూ.26 కోట్ల బిల్లులు ఇవ్వాలని మంత్రిని కోరితే ఆయన అంగీకరించారని, తర్వాత ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సదరు మంత్రి వద్దకు వెళ్లి బిల్లులు ఇవ్వొద్దని అడ్డుకున్నారని తెలిపారు. తన జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. గతంలో నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు రాజకీయ విమర్శలు చేసేవారు తప్ప, వ్యక్తిగత కక్షలు, అరాచకాలకు పాల్పడలేదని తెలిపారు.
ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి వచ్చిన ఓ నాయకుడు కొత్త పద్ధతిని మొదలుపెట్టాడని, బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరైన రూ.50 కోట్ల విలువైన రోడ్డుపనులను రద్దు చేయించాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరితేనే వ్యాపారాలు నడుస్తాయని లేకపోతే మూసివేస్తామంటూ బెదిరిస్తున్నాడని అన్నారు. ఎంత వరకు సహించాలో అంతవరకే సహిస్తామని, అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోనని, తిరుగుబాటు చేసి విప్లవం తీసుకొస్తానని అన్నారు. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పదేండ్లు ఎంపీగా ఉండి ఏనాడూ గ్రామాలకు వచ్చి సేవ చేయలేదన్నారు. బలహీన వర్గాల బిడ్డ, బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. ప్రచారంలో బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బాన్సువాడలో నిర్వహించిన రోడ్షోకు పార్టీ శ్రేణులు వేలాదిగా హాజరయ్యారు. పట్టణం గులాబీమయమైంది. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.