CEIR | మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ఫోన్ ప్రధానమైంది. ప్రస్తుతం మనిషి సెల్ఫోన్పైనే అన్నిరకాల పనులు చక్కబెడుతున్నారు. ఏదైనా దరఖాస్తు చేయాలన్నా, డబ్బుల లావాదేవీలు ఆన్లైన్లో చెల్లించాలన్నా సెల్ఫోన్పైనే ఆధారపడాల్సి వస్తుంది. స్మార్ట్ఫోన్ లేనిదే పని కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో సెల్ఫోన్ పోతే.. దాన్ని ఎలా గుర్తించాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన CEIR ప్రత్యేక అప్లికేషన్ ద్వారా సెల్ఫోన్ ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చు. ఈ ప్రత్యేక యాప్ ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.
సీఈఐఆర్ సాంకేతిక పరిజ్ఞానంతో..
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన CEIR(CENTRAL EQUIPMENT IDENTI TY REGISTER) ను ఉపయోగించడం ద్వారా పోయిన సెల్ఫోన్ను తిరిగి కనిపెట్టే సాంకేతికతను పరిచయం చేస్తున్నారు. ఈ సాంకేతికతను ఉపయోగించి సీఈఐఆర్ వెబ్సైట్ ఓపెన్ చేసి బ్లాక్ చేయవచ్చు. సీఈఐఆర్ వెబ్సైట్లోకి వెళ్లి సెల్ఫోన్ను ఐఎంఈఐ నంబర్ సాయంతో బ్లాక్ చేయవచ్చు. ఆ తర్వాత ఆ సెల్ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. ఒకవేళ ఫోన్ ఆన్చేసి అందులో సిమ్ తీసి కొత్త సిమ్ వేసినా ఆ విషయం ఫోన్ యజమానికి ఎస్ఎంఎస్ ద్వారా తెలిసిపోతుంది.
అన్బ్లాక్ చేయండి ఇలా..
మీ సెల్ఫోన్ను పోలీసులు పట్టుకున్నా.. లేక మీకే దొరికినా.. మీ పాత ఐడీ, ఫోన్ నంబర్, ఇతర వివరాలు నింపిన తర్వాత ఫోన్ ఆన్బ్లాక్ చేసుకోవచ్చు.
బ్లాక్ చేయండి ఇలా..
ఐఎంఈఐ నంబర్ తెలియకపోతే..
ఒకవేళ మీరు ఫోన్ పోగొట్టుకుంటే ఐఎంఈఐ నంబర్ తెలియకపోయినా/గుర్తు లేకపోయినా దాన్ని ఎలా తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నుంచి *#06# డయల్ చేయగానే మీ మొబైల్ నంబర్పై దాని ఐఎంఈఐ నంబర్ ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ ఫోన్ పోగొట్టుకుంటే ఫోన్ కొన్న బాక్స్ మీద లేదా కొనుగోలు చేసిన షాపులో ఉన్న ఇన్వాయిస్ బిల్లు ద్వారా కూడా ఐఎంఈఐ నంబర్ను పొందవచ్చు.
సీఈఐఆర్ పరిజ్ఞానంతో గుర్తించడం సులువు
వేలకు వేలు ధారపోసి కొన్న స్మార్ట్ఫోన్ పోయినా, ఎవరైనా దొంగిలించినా ఆ బాధ వర్ణణాతీతం. ఫోన్లో విలువైన సమాచారం అగంతకుల చేతికి చేరితే ఎలా అనే భయాందోళనలు మొదలవుతాయి. కొంతకాలంగా సెల్ఫోన్ల చోరీలు పెరిగిపోతున్నాయి. ఫోన్ పోగొట్టుకున్న వారంతా పోయిన ఫోన్ కన్నా అందులో ఉండే డేటా కోసం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం ఇలా ప్రతి సమాచారాన్ని సెల్ఫోన్ నుంచే నిర్వహిస్తున్నారు. కరోనా తర్వాత డేటా వినియోగం పెరిగింది. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు స్మార్ట్ఫోన్ వినియోగం ముమ్మరంగా పెరిగింది.
ఈ క్రమంలో తమ వ్యక్తిగత, ఆఫీస్ల సమాచారాన్ని సాఫ్ట్ కాపీల రూపంలో సెల్ఫోన్లలో భద్రపరుచుకుంటున్నారు. ఒకమాటలో చెప్పాలంటే దైవందిన జీవితంలో ఫోన్ కీలకంగా మారింది. అంతటి కీలకమైన ఫోన్ పోగొట్టుకుంటే లేదా చోరీకి గురైతే పరిస్థితి ఏంటి? అంతటి కీలకమైన స్మార్ట్ఫోన్ పోయినా.. పోగొట్టుకున్నా.. అందులో డేటా చోరీకి గురైనా పలు సున్నితమైన విషయాలు బయటికి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇకపై అలాంటి చికులు లేకుండా రాష్ట్ర పోలీస్ శాఖ వినూత్న సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆందోళన అవసరం లేదు
ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ అత్యంత కీలకమైన పరికరం అయ్యింది. ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, దరఖాస్తు చేసుకోవాలన్నా, మొబైల్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా అందులో ఉన్న డేటా ఎక్కడ పోతుందోననే భయపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇక నుంచి ఆ భయం అవసరం లేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న CEIR అనే అప్లికేషన్ ద్వారా ఫోన్ ఎకడైనా పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా దానిని ఇట్టే గుర్తించవచ్చు. ఈ టెక్నాలజీపై ఇప్పటికే అన్ని స్టేషన్ల రైటర్లకు శిక్షణ ఇచ్చారు. దీనిపై సెల్ఫోన్ వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపై మొబైల్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఎలా పని చేస్తుంది..?
24 గంటల్లో రికవరీ…
నిజామాబాద్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల రాజు తన సెల్ఫోన్ను నగరంలోని హమాల్వాడీ ప్రాంతంలో పోగొట్టుకున్నాడు. సీఈఐఆర్ టెక్నాలజీ గురించి తెలుసుకున్న రాజు.. వెంటనే పోయిన సెల్ఫోన్ వివరాలతో వెబ్సైట్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ సిగ్నల్స్ను ట్రేస్ చేసి మొబైల్ను గుర్తించారు. 24 గంటల్లో సెల్ఫోన్ను రికవరీ చేసి బాధితుడు రాజుకు అందజేశారు.
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన మహ్మద్ జునైద్ గత నెలలో బైక్పై వెళ్తూ తన మొబైల్ను పోగొట్టుకున్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా మొబైల్ సిగ్నల్స్ను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు జునైద్కు పోలీసులు మొబైల్ను తిరిగి అప్పగించారు. తన మొబైల్ తనకు అప్పజెప్పినందుకు పోలీసులకు జునైద్ ధన్యవాదాలు తెలిపారు.
కోటగిరి మండలం పొతంగల్ గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తించే శ్రీనివాస్ ఇటీవల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బస్సు ఎక్కుతుండగా తన మొబైల్ పోయింది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కొత్తగా ప్రవేశపెట్టిన సీఈఐఆర్ ద్వారా సెల్ఫోన్ను కనిపెట్టారు. అనంతరం బాధితుడు శ్రీనివాస్కు పోలీసులు మొబైల్ను అందజేశారు.
నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్కు చెందిన సోని అనే మహిళ మూడు రోజుల క్రితం తన సెల్ఫోన్ పోగొట్టుకున్నది. వెంటనే త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై జి.శ్రవణ్కుమార్ సీఐఈఆర్ పోర్టల్లో డిటెక్టివ్ స్టాఫ్, కానిస్టేబుల్ అఫ్సర్ ద్వారా ఎంట్రీ చేయించి,రెండు రోజుల్లో మొబైల్ను కనిపెట్టారు. గురువారం బాధితురాలు సోనికి సెల్ఫోన్ను అందజేశారు.
-నిజామాబాద్ క్రైం, మే 4