నిజామాబాద్, అక్టోబర్ 12 : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, చెరువులు, చెక్డ్యాంలు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడుతున్నాయి. మంజీర, గోదావరి నదులు పారుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగానే నీరు వచ్చి చేరింది. విద్యాసంస్థలకు శుక్రవారం (నేటి) నుంచి సెలవులు ప్రకటించారు. సెలవులు రావడంతో ఎక్కడెక్కడో చదువుకుంటున్న విద్యార్థులంతా ఇంటికి వచ్చేస్తారు. గ్రామంలో సంతోషంగా గడిపేందుకు ఉత్సాహం చూపుతుంటారు. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్తుంటారు.
సరదా కోసం చెరువులు, వాగులు, కుంటలు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లి ఈతలు కొడుతుంటారు. ఈత నేర్చుకుంటుంటారు. ఈత వచ్చిన వారు, రాని వారు నీటిలో దిగి జలకాలాటాల్లో మునిగి తేలుతుంటారు. ఈ సమయంలో అనుకోని ప్రమాదం జరిగితే ఎంతో సంతోషంగా గడపాల్సిన పండుగ సమయంలో విషాదం నిండిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే పిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారు ఏంచేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు గమనిస్తూ ఉండాలి. నీటి వనరుల వద్దకు పిల్లలు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు చెప్పాలి.
పొంచి ఉన్న ప్రమాదం
జిల్లాలో పలు చోట్ల చెరువుల్లో మునిగి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ఈత రాని వారు ఈత వచ్చిన వారిని వెంట తీసుకెళ్లడం ఉత్తమం. స్నేహితులతో కలిసి ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకపోవడం ఉత్తమం.
చెరువుల వద్ద జాగ్రత్త…
ఎప్పుడో చూసిన చెరువులు వాటి రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ గుంత ఉంటుందో, ఎక్కడ ఊబి ఉంటుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చెరువుల్లోకి దిగక పోవడమే చాలామంచిది. ఇక చెరువులో స్నానాలు చేయాలన్న ఆలోచననే మానుకోవడం మంచిది.