నిజామాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ అనేక మాటలు మాట్లాడారని, షాదీముబారక్ తప్పా మైనార్టీలకు చేసిందేమిటీ అని అంటున్నారని తెలంగాణ ప్రభుత్వం మై నార్టీలకు ఎంతో చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అధికారంలో ఉండి 50- 60 ఏండ్లలో కాంగ్రెస్ కేవలం 12 పాఠశాలలు ఏర్పాటు చేసి 6వేల మందిని చదివిస్తే, పదేండ్లలో 204 పాఠశాలలతో లక్షమంది మైనార్టీలకు విద్యను అందిస్తున్నది కేసీఆర్ అని చెప్పారు. మీకూ మాకు పోలిక లేదు.. పొంతన లేదు. నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ వ్యాఖ్యానించారు. నిజామాబాద్లో మంగళవారం మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ కాంగ్రె స్, బీజేపీ తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు భారీ తేడా ఉందని, పోల్చుకునేంత పనులేవీ కాంగ్రెస్ చేయలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద ర్యాలీ తీసినా ఇప్పటికే నిజామాబాద్ ప్రాంత ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చూసి ఉన్నారని అన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధి సైతం ప్రజల మదిలో ఉన్నదని చె ప్పారు. నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్ అలీని కాదని, కాం గ్రెస్ను కాదని గణేశ్ గుప్తాను తప్పక ప్రజలంతా ఈ ఎన్నికల్లో గెలిపిస్తారని కవిత చెప్పారు. తెలంగాణకు వచ్చిన ప్రధా ని మోదీ అనేక అంశాలపై మాట్లాడారని గుర్తుచేశారు. బీజేపీ చెప్పే సబ్ కా సాత్… సబ్ కా వికాస్లో తెలంగాణ పేరు లేదన్నారు. తెలంగాణ ప్రస్తావన ఎక్కడా కనిపించదన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి ఐఐటీ, ఐఐఎం, కనీసం ఒక్కటైనా మెడికల్ కాలేజీ అయినా వచ్చేదని గుర్తుచేశారు. రాష్ర్టానికి రూపాయి అదనపు సాయం కూడా కేంద్రం నుంచి అందలేదని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులకు అడ్డంకి సృష్టించడం బీజేపీతోనే జరిగిందన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలంతా ఆలోచించాలని సూచించారు. ఎన్నికల్లో గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదన్నారు. ఉట్టిగనే ఇదంతా అంటున్నారన్నారు.