బీపేట్, ఏప్రిల్ 15: మండలంలోని యాడారంలో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఆదివారం బస్స్టాప్ వద్ద ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. దీనిపై ఎంపీడీవో పూర్ణ చంద్రోదయకుమార్, ఎంపీవో కృష్ణ, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణాగౌడ్, మిషన్ భగీరథ అధికారులు స్పందించారు.
సోమవారం ఉన్నతాధికారుల సమక్షంలో ట్యాంకు నుంచి ఇంటింటికీ కుళాయిల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇంటింటా తిరిగి పరిశీలించగా.. అన్ని ఇండ్లకు నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరో వార్డులో కుళాయిలు సరిగ్గా రావడంలేదని, బోరు మోటరు బిగించాలని వార్డు సభ్యులు అధికారులను కోరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, జీపీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.