ఇందల్వాయి, డిసెంబర్ 4 : 44వ జాతీయ రహదారిని ఆనుకొని మండలంలోని గన్నారం నుంచి సిర్నాపల్లి వరకు డబుల్ లేన్ బీటీ రోడ్డు నిర్మాణం ఐదు రోజుల క్రితం పూర్తయ్యింది. రూ. 10 కోట్ల 50 లక్షలతో 8.3 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించారు. దీంతో మెగ్యానాయక్ తండా, స్టేషన్ తండా, సిర్నాపల్లి గ్రామాలకు వెళ్లే వాకి డబుల్ రోడ్డు సౌకర్యంగా మారింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
44వ జాతీయ రహదారి నుంచి సిర్నాపల్లి వరకు వెళ్లాలంటే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సిర్నాపల్లిలో వాటర్ ఫాల్ ఉండడంతో ఇతర జిల్లాల వాసులు తరచూ వస్తుంటారు. మిషన్ భగీరథ పైపులైన్ కోసం తవ్విన గుంతలు, ఇతర పైపులైన్ కోసం రహదారులకు అడ్డంగా తవ్విన కందకాలతో రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డు పూర్తిగా ధ్వంసమవడంతో మరమ్మతులు చేపట్టాలని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు విన్నవించారు. స్పందించిన ఆర్టీసీ చైర్మన్.. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి నిధులు మంజూరు చేయాలని కోరడంతో రూ. 10 కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు చేశారు. దీంతో డబుల్ రోడ్డు పూర్తవడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గన్నారం గ్రామానికి వెళ్లే దారిలో చిన్నవాగు ఉన్నది. రోడ్డు మధ్యలో బ్రిడ్జి నిర్మాణం చేపడితే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. వానకాలం వాగు నుంచి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్టీసీ చైర్మన్ బ్రిడ్జి నిర్మాణం పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రోడ్డు పనులు కాక ముందు రహదారి వెంట వెళ్దామంటే చాలా ఇబ్బందిగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారా రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చొరవతో రోడ్డు నిర్మాణ పనులకు మోక్షం లభించింది.
– శేఖర్, సిర్నాపల్లి
గన్నారం నుంచి సిర్నాపల్లి వరకు డబుల్ రోడ్డును నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి సహకరించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– చిలువేరి గంగాదాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు