భీమ్గల్, నవంబర్ 30: అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా మారుస్తున్న రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై ఎంపీ అర్వింద్ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని భీమ్గల్ ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. పదిహేను రోజుల నుంచి నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎంపీ అర్వింద్ మంత్రిపై పచ్చి అబద్ధ్దాలు మాట్లాడారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని వారు అన్నారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన వ్యక్తి అర్వింద్ అని దుయ్యబట్టారు. కమిషన్ల కోసం, బీ ఫారాలు అమ్ముకొని డబ్బులు సంపాదించిన నీచ చరిత్ర ఎంపీ అర్వింద్ది అని అన్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిపై ఆరోపనలు చేస్తే ఊరూకునేదిలేదన్ని హెచ్చరించారు.
60 యేండ్లలో జరగని అభివృద్ధిని 8 యేండ్లలో చేసి చూపిన వ్యక్తి మంత్రి ప్రశాంత్రెడ్డి అని, అందుకే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. దొంగ లెక్కలు చెబుతూ అందరినీ అయోమయానికి గురిచేయడం ఎంపీ అర్వింద్కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కేంద్రం ప్రభుత్వ నిధులతో చెక్డ్యాంలు నిర్మించారని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంటే ఉంటారని, ఆయనను మరోసారి భారీ మోజారిటీతో గెలిప్తారని అన్నారు. కార్యక్రమంలో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గుణ్వీర్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోయిజ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మా నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు సతీశ్, లింగయ్య, మూత లింబాద్రి మల్లెల ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి కనిపించడం లేదా..
మోర్తాడ్, నవంబర్30: ఎమ్మెల్యే ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా అన్నారు. మోర్తాడ్లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే అనిల్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో మంత్రివేముల ప్రశాంత్రెడ్డి చేపట్టిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పెద్దవాగులో చెక్డ్యాంలు, మండల కేంద్రాల్లో సెంట్రల్ లైట్లు, ఎవరూ ఊహించని రీతిలో సబ్స్టేషన్లు, వరదకాలువలో 365 రోజులు సాగునీరు నిలువ, మోర్తాడ్లో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు వంటి ఎన్నో పనులు చేపట్టారని అన్నారు. కనుమరుగవుతున్న కాంగ్రెస్ను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతామంటే ప్రజలు ఊరుకోరని అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేస్తానని చెప్పి అమెరికా పారిపోయావన్న సంగతి ప్రజలు మరవలేదని, గత ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతైన విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన కమిటీ సభ్యుడు సంజీవ్రెడ్డి, వైస్ఎంపీపీ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు సత్యనారాయణ, సొసైటీ ఉపాధ్యక్షుడు దడివె నవీన్, శాస్త్రీ, రాజేశ్వర్, సుమన్, గణేశ్, రమేశ్, వాంకారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మండలం అభివృద్ధికి మంత్రికృషి
మోర్తాడ్, నవంబర్30: మండలంలో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి పనులు మంత్రి ప్రశాంత్రెడ్డి సహకారంతో చేపడుతున్నట్లు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా అన్నారు. వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు బుధవారం వారు శంకుస్థాపన చేశారు. వడ్యాట్లో ముదిరాజ్ సంఘ భవనానికి, దోన్పాల్లో మున్నూరు కాపు సంఘ భవనానికి, వడ్డెరసంఘ భవన ప్రహరీ నిర్మాణానికి, తిమ్మాపూర్లో దిబ్బరాజేశ్వర ఆలయం ప్రహరీ నిర్మాణానికి, మసీదు పనులకు శంకుస్థాపన చేశారు. తిమ్మాపూర్ వేంకటేశ్వర మందిరంలో సీసీ పనులు పూర్తికాగా వారు ప్రారంభించారు. పాలెంలో ఖబ్రస్థాన్కు ప్రహరీ నిర్మాణం పనులు, వీడీసీ భవన నిర్మాణానికి, గురడికాపు సంఘ భవనం అదనపు పనులు, దొన్కల్లో విశ్వబ్రాహ్మణసంఘ భవన నిర్మాణానికి, ధర్మోరాలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.