ఖలీల్వాడి, డిసెంబర్ 1 : ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ప్రేమతో ఆదరించాలని, వివక్ష చూపవద్దని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖలోని ఎయిడ్స్, నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐడీవోసీ సమావేశ మందిరంలో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు కలెక్టర్ నారాయణరెడ్డి హాజరై మాట్లాడారు.
ఎయిడ్స్పై యువత అవగాహన కలిగి ఉండాలని, యువత డ్రగ్స్, ఇతర దురలవాట్ల బారిన పడవద్దని అన్నారు. 20 సంవత్సరాల క్రితం ప్రజల్లో అవగాహన లోపంతో ఎయిడ్స్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండేదని, ప్రజల్లో అవగాహన పెరిగి జిల్లాలో పాజిటివ్ రేటు 5.25 శాతం నుంచి 0.51 శాతానికి తగ్గిందని తెలిపారు. ఎయిడ్స్ అయినా, కొవిడ్ అయినా ప్రజల్లో అభద్రతా భావాన్ని పోగొట్టి అంకితభావంతో పనిచేసిన ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల ధైర్యాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.
జిల్లా సివిల్ జడ్జి అండ్ జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ పి.పద్మావతి మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 4333 హెచ్ఐవీ సోకిన బాధితులున్నారని, తల్లి నుంచి శిశువుకు వ్యాధి సోకకుండా 18 మంది శిశువులను కాపాడామని డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు. అనంతరం కరపత్రాలు, పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఉత్తమ సేవలందించిన సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలకు జడ్జి చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. హెచ్ఐవీతో ఉన్న గర్భిణులకు డెలివరీ చేసిన డాక్టర్ రోహిణి, డాక్టర్ శ్రీదేవి, సిబ్బందిని సత్కరించారు.
కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ జలగం తిరుపతి, డీఐవో డాక్టర్ అశోక్, పీడీ ఎన్సీడీ డాక్టర్ వెంకన్న, డాక్టర్ శ్రీనివాస్గౌడ్, డీపీవో సుధాకర్, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, లెస్లీ, సమత, ఎన్ఎస్ఎస్ సునీత, విక్రమ్, ఆశకార్యకర్తలు, గిరిరాజ్ కళాశాల విద్యార్థులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.