కామారెడ్డి, మార్చి 7: ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకకులు ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎలాంటి ఫీజులు లేకుండా చేపడతామని హామీ ఇచ్చి.. అధికారంలోకి రాగానే ప్రజల నుంచి ఫీజులు దండుకోవాలని చూస్తున్నారన్నారు.
సీఎం ఇచ్చిన మాట మేరకు ప్రజల భూములను ఉచితంగా క్రమబద్ధీకరించాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఫీజులు కట్టాలని ఫోన్లు రాకుండా ప్రభుత్వాధికారులు చూడాలని అన్నా రు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తొలగించి ప్రధాని మోదీ ఫొటోను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ము జీబుద్దీన్, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నల్లవెల్లి అశోక్ పాల్గొన్నారు.