నిజామాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి పౌరసరఫరాల శాఖలో గందరగోళం చోటుచేసుకున్నది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన వేళ మొన్నటి వరకు ఒకే అధికారికి రెండేసి పోస్టులను అప్పగించి చేతులు దులుపుకొన్నారు. ధాన్యం కొనుగోళ్లను మమ అనిపించేందుకు ప్రభుత్వం సిద్ధపడగా రెండేసి పోస్టులను నిర్వహించడం తనతో కుదరదని డీఎస్వో తేల్చిచెప్పారు. దీంతో డీఎస్వోను కాదని ఆయన కింద పనిచేసే ఏఎస్వోకు డీఎం పోస్టును అప్పగించారు. ఇన్చార్జీగా ఏఎస్వోకు అప్పగించినప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత, వేగవంతమైన ప్రక్రియ జరగడం లేదు. అనుభవలేమి, సమన్వయ కొరత, సమయస్ఫూర్తి కొరవడడంతో ఒకడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా కామారెడ్డిలో ధాన్యం సేకరణ జరుగుతున్నది. పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థలో వేర్వేరుగా విధులు ఉంటాయి. డీఎస్వో, డీఎం పోస్టులకు సీనియార్టీ ప్రకారం అధికారుల కేటాయింపును ధాన్యం కొనుగోళ్లకు ముందే నియమించాల్సిన అవసరం ఉంటుంది. కానిక్కడ మాత్రం అదేమీ జరగలేదు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముంచుకొస్తున్న నేపథ్యాన్ని గ్రహించి పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్కు మార్చి మొదటి వారంలో కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని ముందస్తుగానే ప్రభుత్వానికి సూచన చేశారు. నెల రోజులవుతోన్నా సర్కారు నుంచి ఉలుకు పలుకు లేదు. స్వయానా కలెక్టరే లేఖ రాసినా ప్రభుత్వ స్థాయిలో చలనం లేకపోవడంపై ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. కామారెడ్డి జిల్లాకు పౌరసరఫరాల శాఖ అధికారిగా మల్లిఖార్జున్ పనిచేస్తున్నారు. సదరు అధికారి గతంలో చిన్నపాటి జిల్లాల్లో పనిచేశారు. అక్కడ ధాన్యం కొనుగోళ్లకు ప్రాధాన్యత తక్కువ. కామారెడ్డిలో లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం రాకను దృష్టిలో పెట్టుకొని అనుభవజ్ఞులు అవసరం. సర్కారు నుంచి స్పందన కరువైన నేపథ్యంలో జిల్లా స్థాయిలో సర్దుబాట్లకు ఉన్నతాధికారులు ముందడుగు వేశారు. డీఎస్వో ససేమిరా అనడంతో ఏఎస్వోను ఇన్చార్జి డీఎంగా నియమించారు.
ధాన్యం కొనుగోళ్లు అనగానే రైతుల నుంచి మద్దతు ధరకు వడ్లను కొనడంతోనే సరిపోదు. సేకరించిన ధాన్యాన్ని రైస్మిల్లర్లకు కేటాయింపులు జరపాలి. మర ఆడించిన ధాన్యాన్ని తిరిగి ఎఫ్సీఐకి అప్పగించే బాధ్యతలను పౌరసరఫరాల శాఖనే చూడాలి. మేనేజర్ లేకపోవడంతో ఇప్పుడున్న ఇన్చార్జి అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మొత్తంగా పౌరసరఫరాల శాఖలో గందరగోళం, అయోమయంతో కిందిస్థాయి సిబ్బంది సైతం ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ఏ విధంగా ముగుస్తుందోనన్న ఆందోళన ఉన్నతాధికారులను వెంటాడుతున్నది.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత పాలకుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది. ఇందుకు ధాన్యం కొనుగోళ్లలో వెలుగు చూస్తున్న వ్యవహారాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతారావుతోపాటు ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ కొనసాగుతున్నప్పటికీ ఈ వ్యవహారంపై దృష్టి మాత్రం పెట్టలేదు. ఎన్నికల షెడ్యూల్కు ముందే సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఉమ్మడి జిల్లాను గాలికి వదిలేశారు. మూడు వారాల క్రితం వడగళ్ల వానతో పంట నష్టపోయిన వారిని పరామర్శించి చేతులు దులుపుకొన్నారు.