చదువు, నైపుణ్యం లేక ఇబ్బందులు పడే నిరుద్యోగులకు భరోసానివ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. నిరుద్యోగులకు నాణ్యమైన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్) సెంటర్ను నెలకొల్పుతున్నది. కలెక్టరేట్కు సమీపంలో ఎకరం విస్తీర్ణంలో రూ.6.15 కోట్ల వ్యయంతో అధునాతన భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. హైదరాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఉన్న ఈ అకాడమీ సేవలు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవతో మన దగ్గర త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అకాడమీ ప్రారంభమైతే నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి.
నిజామాబాద్, ఫిబ్రవరి 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాణేనికి రెండు పార్శాలు ఉన్నట్లుగానే ఉపాధి వెతుకులాటలోనూ రెండు రకాల అ నుభవాలు ఎదురవుతుంటాయి. మొదటిది అనుభవం, నైపుణ్యమైతే. రెం డోది అనుభవరాహి త్యం, నైపుణ్యతలేమి. నైపుణ్యంతో అడుగు ముందుకేసినోళ్లకు డజన్లకొద్దీ అవకాశాలు ఎక్కడైనా పుష్కలం. ఎలాంటి టాలెంట్ లేకుండా వీధుల్లో తిరిగే వారికి అంతా అగమ్యగోచరం. ఇలాంటి ఆగమాగమయ్యే పరిస్థితులకు ఫుల్స్టాప్ చెప్పడం కోసం, సందిగ్ధావస్థలో ఉన్న యువతకు చుక్కానిలా నిలవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ)ని నెలకొల్పుతున్నది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రెండేండ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఎన్ఏసీ శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటున్నది. హైదరాబాద్, జగిత్యాలలో మాత్రమే ఉన్న ఎన్ఏసీ త్వరలోనే నిజామాబాద్ కేంద్రంగానూ అత్యుత్తమమైన సేవలు అందించనున్నది. గల్ఫ్ బాటలో ముందుండే నిజామాబాద్ జిల్లాకు ఎన్ఏసీ సెంటర్ ద్వారా శిక్షణా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తే యువత కు ఉపాధి విషయంలో ఢోకా ఉండదు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా..
నిజామాబాద్లో సమీకృత కలెక్టరేట్ భవనం, ఐటీ టవర్కు కూత వేటు దూరంలో నిర్మితమవుతున్న న్యాక్ సెంటర్కు జిల్లా నైపుణ్య అభివృద్ధి కేంద్రంగా ఇప్పటికే నామకరణం చేశారు. ఇందుకోసం రూ.6.15 కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఏసీ ప్రధాన కార్యాలయం హైటెక్స్ ప్రాంగణంలో ఉంది. జగిత్యాల జిల్లాలోనూ ఎన్ఏసీ కేంద్రం ఉంది. నిజామాబాద్ జిల్లా యువత మేలు కోసం ఎన్ఏసీ సెంటర్ను నెలకొల్పేందుకు మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంకల్పించారు. అందులో అధునాతన సౌకర్యాలను కల్పించనున్నారు. ఐదు స్మార్ట్ క్లాస్ గదులు, మూడు ప్రయోగశాలలు, ఒక కంప్యూటర్ ల్యాబ్, 120 మంది అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యానికి వీలుగా హాస్టల్, ఒక కౌన్సెలింగ్ గది, ఒక ప్లేస్ మెంట్ రూమ్, ఎనిమిది కార్యాలయ గదులను నిర్మించనున్నారు. చదువుతో సంబంధం లేకుండా స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్న వారందరికీ ఎన్ఏసీ చుక్కానిగా నిలువనున్నది. మేసన్ జనరల్, అసిస్టెంట్ బార్ బెండర్ అండ్ స్టీల్ ఫిక్చర్, షట్టరింగ్ కార్పెంటరీ, కన్స్ట్రక్షన్ పెయింటర్ అండ్ డెకరేటర్, అసిస్టెంట్ టెక్నీషియన్ డ్రై వాల్ అండ్ ఫాల్స్ – సీలింగ్, అసిస్టెంట్ ఎలక్ట్రీషన్, ప్లంబర్(జనరల్), అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ వర్క్ సూపర్వైజర్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డర్, అసిస్టెంట్ స్టోర్ కీపర్ అండ్ స్టోర్ కీపర్, సూపర్వైజర్ స్ట్రక్చర్, స్వయం ఉపాధి కోసం టైలరింగ్ వంటి వాటి ల్లో శిక్షణ ఇస్తారు. ఎకరం స్థలంలో నిర్మిస్తున్న న్యాక్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. భవన నిర్మాణాన్ని జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో 12,519 చదరపు అడుగులు, మొదటి అంతస్థులో 12,519 చదరపు అడుగులు, రెండో అంతస్థులోనూ మరో 12,519 చదరపు అడుగుల విస్తీర్ణంతో మొత్తం 37,556 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు.
మంత్రి వేముల సంకల్పం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో 1998లో న్యాక్ ఏర్పాటైంది. దీని ద్వారా 25కి పైగా వృత్తి విద్యా కోర్సుల్లో చదువు మధ్యలో ఆపేసిన, ఉన్నత చదువులు చదవలేని లక్షలాదిమందికి నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. తెలంగాణలో ఉవ్వెత్తున్న జరుగుతున్న నిర్మాణాలతో కన్స్ట్రక్షన్ రంగంలో ఉపాధి అవకాశాలు అనే కం ఉన్నాయి. చిన్నపాటి పట్టణాలు, మేజర్ పంచాయతీలకు సైతం నిర్మాణరంగం విస్తరించడంతో ఇంజినీర్లు, నైపుణ్యం ఉన్న పనిమంతుల కొరత ఏర్పడింది. దశాబ్దాలుగా తెలంగాణ నుంచి నిర్మాణరంగ కార్మికులు, ఇంజినీర్లు అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. డిగ్రీలు ఉం డి సరైన నైపుణ్యం లేక ఇక్కడ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మానవ వనరులను స్కిల్డ్ వర్క్ఫోర్స్గా రూ పాంతరం చేసి నిర్మాణ రంగంలో డిమాండ్ను అధిగమించాలంటే నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఉన్న న్యాక్ సెంటర్ను నిజామాబాద్లో ఏర్పా టు చేస్తే గల్ఫ్కు వెళ్లే వారితో పాటు సొంత రాష్ట్రంలో పని చేసుకోవాలనుకునే వారికి మేలు చేకూరుతుందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భావించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యువతకు పెద్ద పీట వేయడమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధికి బాటలు పరిచారు.
నిరుద్యోగులకు ఆశాకిరణం..
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో న్యాక్ బిల్డింగ్ కోసం ఎకరం స్థలంలో రూ.6.15 కోట్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణం చేపడుతున్నాం. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో అత్యాధునిక భవనాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ) నిరుద్యోగ యువతకు ఆశాకిరణం లాంటిది. ఉన్నత చదువులు లేని వారి నైపుణ్యాభివృద్ధికి ఎన్ఏసీ పాటుపడుతుంది.
– జి.రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఈ, రోడ్లు, భవనాల శాఖ