సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో రాష్ర్టాన్ని కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసింది. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రగతిపై నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాల పేరుతో విమర్శలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లో తెలంగాణ భవన్లో ఆదివారం స్వేదపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి ఆవిష్కృతమైంది.
ఎస్సారెస్పీ ఎగువన నాడు పొరుగు రాష్ట్రం వరుస ప్రాజెక్టులు నిర్మించడం, మరో పక్క వర్షాభావ పరిస్థితులు ఉండేవి. ఎగువన మహారాష్ట్ర నుంచి నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తరచూ ఖాళీ కుండలా దర్శనమిచ్చేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీటిని అందించేలా రూ.1000 కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని అందించారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్సీ వరద కాలువలో ఏడాదంతా కాళేశ్వరం జలాలు ఉంచుతున్నారు. దీంతో నాడు ఒక్క పంటకు నీరివ్వని వరద కాలువ.. నేడు సాగునీటి చింత లేకుండా రెండు పంటలకు నీరందిస్తున్నది. కాళేశ్వరం జలాలను తెచ్చి వరద కాలువ ఆయకట్టుకు అందించుకునే వీలుతో ఎస్సారెస్పీలో ఎప్పుడైనా చివరిగా మిగిలిన నీటిని సైతం కాకతీయ కాలువకు అందించుకునే భరోసా ఏర్పడింది. దీంతో కాకతీయ కాలువ సైతం మూడు కాలాలు నీటితో కళకళలాడుతున్నది. ఇదంతా కేసీఆర్ సర్కారు సాగు నీటి వనరునలు పెంచడం ద్వారా సాధ్యమైంది. దీనిని అప్పుగా చూస్తే తమకు సాగు నీరు అందేది కాదని రైతులు అంటున్నారు.
స్వేద పత్రం ప్రజెంటేషన్లో వివరిస్తున్న క్రమంలో రోడ్లు, భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల సొంత భవనాలు, నూతన కలెక్టర్లు, సచివాలయం తదితర చారిత్రక నిర్మాణాల గురించి వివరిస్తూ ఆర్అండ్బీ శాఖ మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి రేయింబవళ్లు పడిని కష్టాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో చేపట్టిన చారిత్రక నిర్మాణాల్లో మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి ఒక పాలేరులా శ్రమించారని కొనియాడారు.
జిల్లాలో నిజాంసాగర్ భూములకు నీరు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాలువలను బాగు చేయిచింది. దీంతో దశాబ్దాల తర్వాత బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజక వర్గాల్లో చివరి ఆయకట్టు వరకు నీరందించుకునే పరిస్థితి ఏర్పడింది. వీటితోపాటు జిల్లాలో విద్యుత్ సామర్థ్యం, విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను పెంచి సరిపడా నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా ఇవ్వడంతో రైతులు బోరు బావులు, మోటర్లు పెంచుకొని వ్యవసాయాన్ని పండుగలా మార్చుకున్నారు. ఎస్సారెస్పీ కాలువల వెంట గతంలో రైతుల మోటర్లు నాణ్యమైన కరెంటు లేక తరచూ కాలిపోతూ నష్టాలు మిగిల్చేవి.దీనికి తోడు అధికారులు మోటర్లు పెట్టుకోవడానికి అభ్యంతరం చెప్పేవారు. నాడు ఎస్సారెస్పీ కా లువల వెంట వైర్లను తెంపేసి మోటర్లను తన్నేసేవారు. వాటిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెట్టే వారని ‘స్వేద పత్రం’లో కేటీఆర్ గుర్తు చేశారు.ఆ పరిస్థితిని, కేసీఆర్ పాలనలో మోటర్ల వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడని వైనాన్ని ఈ సందర్భంగా రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
పరాయి పాలకుల హయాంలో నేర పూరిత నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో ఎలాగైతే సాగు నీరు లేక వ్యవసాయం కుంటుపడిపోయిందో.. నిజామాబాద్ జిల్లాలోనూ పరాయి పాలకుల పార్టీల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయం కుంటు పడిపోయి ఉండేది. బోరు బావులే శరణ్యమైన పరిస్థితుల్లో బోరుబావుల కోసం తమ భార్యల పుస్తెలను అమ్మి మరీ అప్పులు సాగు చేసిన జిల్లా రైతులకు కేసీఆర్ పాలనలో సాగు నీటి వనరులు పెరిగాయి. పుష్కలంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందింది. కాలువల్లో మూడు కాలాలు అందుబాటులోకి వచ్చిన సాగు నీటిని మోటర్లు పెట్టి మరీ తమ పంటలకు తోడుకుంటే.. గత పాలకుల హయాం లో మాదిరిగా రైతుల మోటర్లను అడ్డుకునే దుస్థితి తొలగిపోయింది.
తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎన్నో సవాళ్లు ముందుండేవి. ఆర్థిక చిక్కులు, రాజకీయ కుట్రలు, విభజన చట్టం అమలు కష్టాలు, ఉద్యోగులు, ఆస్తుల పంపిణీ, విద్యుత్ కొరత, తాగు, సాగునీటి కష్టాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ప్రగతి పాలనకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీటన్నింటినీ అధిగమించి ఆర్థిక ప్రణాళిక లు, క్రమశిక్షణ, అనేక సంస్కరణలు, పాలనా వికేంద్రీకరణ చేయడంతోపాటు అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని ఆగ్రగామిగా నిలిపారు.
రాష్ర్టాన్ని కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఉచిత కరెంటు కోసం రూ.36,899 కోట్లు కేటాయించారు. రైతులకు రూ. 30వేల కోట్ల రుణమాఫీ, రైతుబంధు కింద రూ. 73వేల కోట్లు పంపిణీ చేశారు. రైతుబీమా కింద రూ. ఐదు లక్షల చొప్పున అందజేశారు. రూ.1,34, 768 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అంతేకానీ రాష్ర్టాన్ని అప్పులపాలు చేయలేదు.
నాన్ కమాండ్ ఏరియాను సైతం సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ మా మండలంలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో రూ.476 కోట్లతో నాగమడుగు మత్తడి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సాగు నీటిరంగానికి ప్రభుత్వం రూ.1,76వేల కోట్లు ఖర్చు చేసి నూతనంగా 50 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేశారు.