ఖలీల్వాడి, డిసెంబర్ 27 : నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రాకుండా ఉండేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. మరోవైపు కరోనాను ఎలా అధిగమించాలో జిల్లా అధికార యం త్రాంగం పక్కా ప్రణాళికను తయారు చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖాన 700 పడకల సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాకుండా మహారాష్ట్ర దగ్గరగా ఉండడంతో అక్కడి ప్రజలు సైతం జిల్లాకు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లా కేంద్ర దవాఖానతో పాటు ఆర్మూర్, బోధన్, బాన్సువాడలో దవాఖానల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 43 పీహెచ్సీల్లో సైతం కరోనా టెస్టులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లా దవాఖానలో పీపీఈ కిట్లు, ఆక్సిజన్, కరోనా టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికార యంత్రాగం రంగంలోకి దిగి కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామా ల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నది. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా కేసులు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి అపోహలకు పోకుండా ఇంటివద్ద ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు తెలుపుతున్నారు. కొత్త వేరియం ట్ జేఎన్-1తో ప్రాణహాని లేదని తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. 43 పీహెచ్సీల్లో టెస్టులు చేయించుకోవాలని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసు లు ఇప్పటి వరకు రాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి. ప్రభుత్వ దవాఖానలో ఒక్క కరోనా పేషెంట్ అడ్మిట్ కాలేదు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.
-ప్రతిమారాజ్, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్
జిల్లా వ్యాప్తంగా కరోనాను అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని పీహెచ్సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కరోనాను జిల్లా యంత్రాగం పకడ్బందీగా నియంత్రిస్తుంది. వైద్యా అధికారులు అందుబాటులో ఉన్నారు. అన్ని పీహెచ్సీల్లో కరోనా టెస్టులు చేస్తారు.
-సుదర్శనం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి