తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచి
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు
బీడీ టేకేదారులకు పెన్షన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే..
ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 29 : దేవుడు చిన్న చూపు చూసి దివ్యాంగులుగా పుట్టించినా, సీఎం కేసీఆర్ పెద్ద చూపు చూసి సమాజంలో గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఫంక్షన్హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మూడు మండలాల దివ్యాంగులకు పెరిగిన పింఛన్ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దివ్యాంగులుగా పుట్టిన వారిపై సమాజంలో చిన్నచూపు ఉంటుందని, ఇంట్లో కూడా ఎవరూ పట్టించుకోరని, కానీ సీఎం కేసీఆర్ సమాజంలో వారు గౌరవంగా బతకడానికి ఏర్పాట్లు చేశాడన్నారు. దేశంలో ఎక్కడా నాలుగువేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం లేదని, కనీసం రెండువేల రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం కూడా లేదన్నారు. దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. నేడు రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకా లు దేశానికే దిక్సూచిగా మారాయన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశప్రజలందరికీ వర్తించాలనే సదుద్దేశ్యంతో కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చి పనిచేస్తున్నారన్నారు. అర్హులైన కొంతమందికి దివ్యాంగ పింఛన్లు రావడం లేదని తన దృష్టికి తీసుకువచ్చిందన్నారు. ఇక్కడ ఉన్న మూడు మండలాలకు చెందిన ఎంపీడీవోలు, అధికారులు పెన్షన్ రానివారు స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికెట్ తీసుకువస్తే వారికి మంజూరు చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాలం ఏదైనా కరెంటు సరిగ్గా ఉండేది కాదని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత రైతులకు 24 గంటలపాటు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మనదేనన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, ప్రస్తుతం 10 గంటల విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు మనదగ్గర కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు మభ్యపెట్టడానికి వస్తారని, వారి మాటలకు మోసపోవద్దన్నారు.
అంతేకాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా బీడీ టేకేదార్లను పట్టించుకున్న వారు లేరని, నేడు వారికి పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ తదితర రాష్ర్టాల ప్రజలు కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కావాలని కోరుకుంటున్నారన్నారు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని మనం కాపాడు కోవాలన్నారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్న పార్టీకి ఓటువేయాలన్నారు. రాష్ట్రంతో పాటు దేశం లో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరాలన్నారు.