డిచ్పల్లి, జూన్ 9: తెలంగాణ రాష్ట్రం సంక్షేమానికి చిరునామాగా మారిందని, ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాల్కొండలో నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. నస్రుల్లాబాద్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిచ్పల్లిలో ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ దశాబ్ది వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో విడుత గొర్రెల పంపిణీని ప్రారంభించి, లబ్ధిదారులకు జీవాలను అందించారు. బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందిన లబ్ధిదారులు తమ అనుభవాలను వివరించగా.. స్పీకర్ పోచారం భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, షకీల్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు వేలాదిగా లబ్ధిదారులు తరలివచ్చారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబన్ స్థానంలో ఉన్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్గయుగంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో సంక్షేమ సంబురాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కవిత హాజరై మాట్లాడారు. బీజేపీకి సంస్కారం, సంక్షేమం రెండూ తెలియవని విమర్శించారు. ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామా కేసీఆర్ అని, ఆయన ఆలోచనలకు కంటి వెలుగు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలందరూ తనవారని ఆలోచించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి, సంక్షేమం తెలియదని, సోషల్ మీడియా, వాట్సాప్లో ప్రచారం చేసుకోవడం ఒక్కటే తెలుసునని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పెన్షన్ ఎంగిలి మెతుకుల లాంటిదని అన్నారు. బీడీ పరిశ్రమ మూతపడుతున్న తరుణంలో లక్షలాది మంది కార్మికులకు పెన్షన్ అందజేసి రాష్ట్ర ప్రభుత్వం కొండంత ధైర్యం ఇచ్చిందన్నారు. ఇతర రాష్ర్టాలు బీడీ కార్మికులకు ఇచ్చిందేమీలేదన్నారు.
ఎంబీసీల్లో చేతి వృత్తుల వారికి రూ. లక్ష సాయం అందజేస్తున్నామని, త్వరలో ఇతర వర్గాల వారికి కూడా అందజేసేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. అదికూడా త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్నారు. సంక్షేమం అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ సహాయం చేయడమేనని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గౌడన్నలతోపాటు ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఆసరాగా నిలబడిందని అన్నారు. బోదకాలు, డయాలసిస్ బాధితులకూ ప్రతినెలా పెన్షన్ అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కిడ్నీ బాధితులు హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం 33 జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలకు ఆకర్షితులై మధ్యప్రదేశ్, మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు విస్తరిస్తారని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు.
సొంత ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులకు గృహలక్ష్మి కింద రూ. 3లక్షలు అందించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. భూమిలేని వారిని గుర్తించి ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని ఎమ్మెల్యేలకు ఇదివరకే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎవరూ అడగకముందే ప్రజల కోసం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నేడు లక్షలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటిఅద్దాలను అందజేశామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ వారికి కంటి వెలుగు శిబిరాలకు రప్పించి పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ నవ్వుతూ పేర్కొన్నారు.
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ లక్షలాది మంది బీడీ కార్మికులకు పెన్షన్ పంపిణీ చేసిన ఘనత ఎమ్మెల్సీ కవితకే దక్కుతుందని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తూ దేశాన్ని అప్పులమయంగా మార్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. రాష్ర్టానికి ఇచ్చే రూ.30వేల కోట్లు ఇవ్వడంలేదని, కానీ పొద్దున లేస్తే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్పై అభండాలు వేస్తుంటారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని సూచించారు. అనంతరం గొల్ల, కుర్మలకు రెండో విడుతలో భాగంగా గొర్రెలను పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీసీ కార్పొరేషన్, కులాంతర వివాహ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.