రామారెడ్డి, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు. మండలంలోని కన్నాపూర్తండా, గోకుల్ తండా గ్రామాల్లో శుక్రవారం పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ముఖ్యఅతిథిగా హాజరై 108 మంది లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను అందజేశారు. కన్నాపూర్ గ్రామంలో 52 మంది, గోకుల్తండాలో 56 మందికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే జా జాల.. సేవాలాల్ మహరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు రవీందర్గౌడ్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి, గాంధారి, సదాశివనగర్ ఏఎంసీ చైర్మన్లు సాయినేని సత్యనారాయణరావు, సాయారెడ్డి, సర్పంచులు చందర్ నాయక్, మాలోత్ లలిత, ఎంపీటీసీ ప్రవీణ్గౌడ్, ఇన్చార్జి ఎంపీడీవో సవితారెడ్డి, తహసీల్దార్ ఆనంద్కుమార్, సదాశివనగర్ మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్రావు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కాసర్ల రాజేందర్, ఉప సర్పంచులు శర్మన్ నాయక్, తిరుపతి నాయక్, బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఆదుకున్నాడు..
సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఇప్పుడు రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందని చెప్పడం ధీమా కలిగించింది. ఇకనుంచి మేము ధైర్యంగా భూమిని సాగుచేసుకుంటాం. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సురేందర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-తారాచంద్, గోకుల్తండా
కేసీఆర్కు రుణపడి ఉంటాం
మేము కొన్నేండ్ల నుంచి కబ్జాలో ఉన్నాం. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్నారు. మా బాధలను అర్థం చేసుకొని పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-బదావత్ ధూరి, రైతు, గోకుల్తండా
చాలా సంతోషంగా ఉంది
గత ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకుండా తిరస్కరించాయి. కొన్నేండ్లుగా భూ మిని సాగు చేస్తున్న. సీఎం కేసీఆర్ మా బాధలు, ఇబ్బందులను అర్థం చేసుకొని పట్టాలను అందించారు. చాలా సంతోషంగా ఉంది. పోడు భూములకు పట్టాలు చూస్తానో లేదో అని అనుకున్నా. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
-మాన్సింగ్, రైతు, కన్నాపూర్ తండా