దశాబ్దాలుగా కొనసాగుతున్న పోడు భూముల సమస్య త్వరలోనే పరిష్కారం కానున్నది. అటవీ భూములనే నమ్ముకుని బతుకుతున్న రైతులకు ‘పట్టా’భిషేకం జరుగనున్నది. ఈ మేరకు పోడు పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 30 నుంచి భూ హక్కు పత్రాల పంపిణీని ప్రారంభించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. సర్కారు నిర్ణయంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8 వేల మందికి పైగా లబ్ధి చేకూరనున్నది. సీఎం కేసీఆర్ తాజా ప్రకటనతో పోడు రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
– నిజామాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) అడవిని నమ్ముకొని బతుకీడుస్తున్న సామాన్యులను దశాబ్దాల నుంచి వేధిస్తున్న పోడు భూముల సమస్య త్వరలోనే ముగియనున్నది. హక్కు పత్రాల జారీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దశాబ్ది వేడుకల్లోనే పంపిణీకి నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకి ముహూర్తాన్ని ఖరారు చేశారు. జూన్ 30న రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు చెందిన పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అర్హులైన వారికి పట్టాలను అందిస్తారు. పోడు సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపడంతోపాటు ఇకపై అటవీ భూముల ఆక్రమణను పూర్తిగా నిలువరించడమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్నది. పోడుకు పట్టాలు పంపిణీ చేసిన తర్వాత రక్షిత, రిజర్వ్ అటవీ భూముల్లో మానవ ప్రమేయాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సర్కారు పని చేయనున్నది.
నిజామాబాద్లో 8వేల ఎకరాలు…
అటవీ భూములను ఆక్రమించిన వారు గిరిజనులే అయితే 2006కు ముందు నుంచి సాగులో ఉండాలి. అలాంటి వారి ఆర్థిక స్థితిగతుల వివరాలను ప్రభుత్వం పరిశీలన చేసింది. పదెకరాల లోపు కబ్జాలో ఉండి… ఆ భూమినే జీవనాధారంగా ఉంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందేందుకు అర్హులు. ఇందుకోసం గతేడాది అర్హులైన వారి క్లెయిమ్స్ స్వీకరించారు. సాగు చేసుకుంటున్న వారు ఆధారాలతో ఎఫ్డీవో స్థాయి అధికారులకు దరఖాస్తులు అందించారు. గ్రామ, డివిజినల్ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సిఫార్సు చేయగా జిల్లా కమిటీ అర్హులను ఎంపిక చేసింది. గిరిజనేతరులైతే ఆ కుటుంబం నుంచి మూడు తరాల వారు ఆ భూమిలో సాగు చేసుకుంటున్నట్లు ఆధారాలుండాలి. అటవీ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారు నిజామాబాద్ జిల్లాలో 19మండలాల్లో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం అటవీ భూమి 2,14,700 ఎకరాలు ఉన్నది. పోడు పట్టాల కోసం 14వేల 50 దరఖాస్తులు రాగా 4,229 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో 8వేల ఎకరాలకు పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకున్నది. కామారెడ్డి జిల్లాలో అటవీ విస్తీర్ణం 2,04,727 ఎకరాలు ఉండగా 27,554 ఎకరాలు కబ్జాకు గురైంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4వేల మందికి పోడు పట్టాలిచ్చేందుకు నిర్ణయించారు.
చెట్టు నరికితే జైలుకే…
అడవుల పరిరక్షణలో అవసరమైన చోట పోలీసుల సహకారంతో ఇకపై అటవీ శాఖ కఠిన చర్యలకు సిద్ధం కాబోతున్నది. అటవీ ప్రాంతంలో ఏ ఒక్క చెట్టును నరికినా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నుంచి అడవి, అటవీ భూముల్ని కాపాడుకోవడానికి అంకితభావం, చిత్తశుద్ధితో కృషి చేసేందుకు అటవీ శాఖ పని చేయబోతున్నది. ఫారెస్ట్ రేంజ్ల వారీగా అటవీ విస్తీర్ణం, ఫారెస్ట్ బీట్లు, సిబ్బంది సంఖ్యాపరంగా విధులను వర్గీకరించి నిఘాను కట్టుదిట్టం చేయనున్నది. ఇంటిదొంగల భరతం పట్టడంతోపాటు అక్రమంగా అడవుల్లో కాలు మోపే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే పరిస్థితి ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసిన దరిమిలా కలప స్మగ్లర్లను కటకటాలకు పంపేందుకు సిద్ధం అవుతున్నది. హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం 2015 నుంచి కృషి చేస్తున్నది. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ పనితీరు ఇకపై కీలకంగా మారనున్నది. అడవుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ భావించేలా ప్రజల్లో అవగాహనను పెంపొందించనున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకొని బతుకుతున్న పేదవారికి ఆఖరి అవకాశంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జఠిలమైన సమస్యకు పరిష్కారం…
పోడు భూముల సమస్య అనేక ఏండ్ల నుంచి జఠిలంగా పడి ఉన్నది. తెలంగాణ సిద్ధించిన తర్వాత హక్కులను ప్రసాదిస్తామని కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. తదనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా పోడు భూములపై రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్త సర్వేలు నిర్వహించాయి. పారదర్శకంగా చేపట్టిన ఈ సర్వేలో ఎవరు కబ్జాకోరులు, ఎవరు అసలైన పోడు వ్యవసాయదారులో తేల్చారు. అటవీ ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరిస్తూనే పేద ప్రజలకు మేలు చేసేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. పోడు సమస్యను గతంలోని కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోలేదు. రాజకీయ ఆక్రమణదారులతో చేతులు కలిపి ఏకంగా అడవులను భక్షించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మాత్రం అడవులను కాపాడుతున్నారు. కబ్జాలను నిరోధిస్తున్నారు. గిరిజనులకు అనే క రకాలుగా మేలు చేస్తున్న సీఎం కేసీఆర్… పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ద్వారా వేలాది కుటుంబాల్లో మరోసారి వెలుగులు ప్రసాదిస్తున్నారు.