బాన్సువాడ, ఫిబ్రవరి 27: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ.లక్ష, తులం బంగారం ఎక్కడ దాచారని, ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన చెక్కులనే ఇస్తున్నామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన 222మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ పేదల బాధల్లో పాలుపంచుకున్న నాయకుడు కేసీఆర్ అని, ఆడబిడ్డల పెండ్లికి దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.లక్షా 116 అందించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీవి అమలుకాని హామీలని, ఇప్పటికీ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. రూ.2లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ప్రతినెలా రూ.2500 లాంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు 16వేల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.130కోట్లను అందించామన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఏజాస్, గురు వినయ్కుమార్, శశికాంత్, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ పద్మ గోపాల్రెడ్డి, పిట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ టౌన్, ఫిబ్రవరి 27: బాన్సువాడ నియోజకవర్గంలోని ముగ్గురు దివ్యాంగులకు ప్రభుత్వం అందించిన ట్రైస్కూటర్లను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. ట్రైస్కూటర్లను అందజేసేందుకు కృషి చేసిన ప్రభుత్వ అధికారులను అభినందించారు.