బాన్సువాడ, జనవరి 28 : ఇల్లులేని నిరుపేదలకు సొంత నివాసం ఉండాలనే మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్ వందశాతం సబ్సిడీతో డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు అందిస్తున్నారని, ఈ పథకం దేశానికే ఆదర్శమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ శివారులో రూ. 29.41కోట్లతో రెండో విడుతలో నిర్మించిన 504 ఇండ్లను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించి ఇండ్ల పత్రాలు, తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సభాపతి మాట్లాడారు.
ఇండ్ల నిర్మాణం పథకం కింద గత ముఖ్యమంత్రులు అంజయ్య రూ.400, మర్రి చెన్నారెడ్డి రూ. వెయ్యి , ఎన్టీఆర్ రూ. 6 వేలు, చంద్రబాబు రూ.40 వేలు, వైఎస్సార్ రూ. 70 వేలు ఇచ్చారని గుర్తుచేశారు. ఇందులో సగం మాత్రమే మాఫీ చేసేవారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక పూర్తి సబ్సిడీతో రూ.5.04 లక్షలు ఇస్తున్నారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గానికి 11 వేల ఇండ్లు మంజూరు చేసిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే ఇది రికార్డు అని తెలిపారు.
ఇప్పటికే 7 వేల ఇండ్లు లబ్ధిదారులకు అందజేశామని, మిగతావి నిర్మాణ దశలో ఉన్నట్లు చెప్పారు. తాడ్కోల్ శివారులో కట్టిన వెయ్యి ఇండ్లతోపాటు వెయ్యి ఇండ్లు పూరితచేసి గేటెడ్ కమ్యూనిటీ తరహా వసతులు కల్పిస్తామన్నారు. కాలనీవాసులకు గుర్తింపు కార్డులు అందజేయడంతోపాటు పోలీస్ అవుట్ పోస్టుతో ప్రత్యేక భద్రత కల్పిస్తామన్నారు. సీఎంపై కృతజ్ఞతతో ఈ కాలనీకి కేసీఆర్నగర్గా నామకరణం చేశామన్నారు.
దళారులకు డబ్బులిస్తే జైలుకే..
పైరవీలు చేసి ఇండ్లు ఇప్పిస్తామనేవారిని నమ్మొద్దని, ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే ఇంటిని రద్దుచేయడంతోపాటు ఇద్దరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇల్లు, స్థలం కలిపి లబ్ధిదారులకు రూ. 20 లక్షల ఆస్తి అందించామని తెలిపారు. కాలనీని శుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు..
పట్టణంలో పలు అభివృద్ధి పనులకు స్పీకర్ పోచారం నిధులు మంజూరు చేశారు. తాడ్కోల్ చౌరస్తా నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ మీదుగా లిప్టు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 87 లక్షలు, నర్సింగ్రావ్ కాంటా నుంచి అంగడి మీదుగా సంగమేశ్వర కాలనీ వరకు సీసీ డ్రైనేజీ, బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ. కోటీ 36 లక్షలు, డబుల్ బెడ్రూం కాలనీలో ఫంక్షన్ హాల్ కోసం రూ. 90 లక్షలు, కాలనీ ప్రహరీ కోసం రూ.66 లక్షలు మంజూరు చేశారు. టీటీడీ కల్యా ణ మండపం నుంచి తాడ్కోల్ గ్రామం వరకు సెంట్రల్ లైటింగ్ కోసం రూ. 21 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు.
ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ జితేశ్ పాటిల్
తాడ్కోల్ శివారులో నిర్మించిన వెయ్యి ఇండ్లతో లబ్ధిదారులకు ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ సూచించారు. స్పీకర్ పోచారం లక్ష్యం పేదల కోసం అన్ని మౌలిక వసతులతో ఇండ్లు మంజూరు చేయించారని అన్నారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ సమత, ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, గంగుల గంగారాం, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, హన్మాన్ వ్యాయామశాల అధ్యక్షుడు వినయ్ కుమార్, ఎంఐఎం నాయకుడు సయ్యద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మా బలగం ముందు మీరెంత..
ఇటీవల పనీపాట లేని కొంత మంది నాయకులు తనను బద్నామ్ చేసే పని పెట్టుకున్నారని, తన గురించి ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని వారు భ్రష్టు పట్టించే పనిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు ప్రజాసేవతోనే సమయం సరిపోవడం లేదని, మూర్ఖుల గురించి ఆలోచించే సమయం లేదన్నారు. తమ ప్రజా బలగం ముందు మీరెంత అంటూ ఎద్దేవా చేశారు. కానీ మనం చేసే ప్రతి పనినీ దేవుడు గమనిస్తాడని, మంచి చేసినవారికి మంచే జరుగుతుందని అన్నా రు. చెడు చేసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.