ఖలీల్వాడి, నవంబర్ 23 : జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 35 మంది లబ్ధిదారులకు రూ.14,38,500 విలువ చేసే చెక్కులను అందజేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకెళుతున్నామని, ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచి మెరుగైన సేవలందిస్తున్నామని తెలిపారు. గర్భిణులు, బాలింతలకు ఎన్నో సేవలందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ నాయకులు సుజిత్సింగ్ ఠాకూర్, రవి చందర్, సత్యప్రకాశ్, సిర్ప రాజు, ఎనుగందుల మురళి, శివచరణ్, సాయివర్ధన్, బట్టు రాఘవేందర్, ఎర్రం గంగాధర్, అంతరెడ్డి దేవి, నిచెంగు కృష్ణ, చంద్రకళ, నీలగిరి రాజు, చంద్రభూషణ్, సీతారాం, ముత్యాలు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన చిన్నారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,50,000 మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును చిన్నారికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా బుధవారం అందజేశారు. గతేడాది డిసెంబర్ 21న నగరంలోని గాజుల్పేట్కు చెందిన చిన్నారి లక్ష్మీప్రసన్న అయ్యప్ప మాలధారణలో ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే బిగాల.. దవాఖానలో చిన్నారిని పరామర్శించి రూ.50 వేలు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందేలా చూస్తానని కుటుంబసభ్యులకు హామీనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,50,000 మంజూరు చేయించి చెక్కును అందజేశారు.