నిజామాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి); లోక్సభ ఎన్నికల వేళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై అసంతృప్తి వెల్లువెత్తుతున్నది. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీలోనే నిరసన గళం వినిపిస్తున్నది. ఐదేండ్లుగా ఎంపీగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ఇసుమంతైనా అభివృద్ధి చేయకపోగా నోటికొచ్చి మాట్లాడుతూ పబ్బం గడుపుతుండడంపై ప్రజలతోపాటు పార్టీ శ్రేణుల్లో భారీగా వ్యతిరేకత ఏర్పడింది. కార్యకర్తలకు విలువ ఇవ్వకపోవడం, కొత్త నాయకులను తెర మీదికి తెచ్చి పాత తరం నేతలను పలుచన చేయడం వంటి చర్యలు బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అర్వింద్ వద్దే వద్దు.. అంటూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన నాయకత్వం ధర్నాలు, నిరసనలు, ఆఖరికి పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం దాకా వెళ్లింది. అర్వింద్కు టికెట్ ఇస్తే మాత్రం తాడోపేడో తేల్చుకుంటామంటూ కార్యకర్తలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ధర్మపురి అర్వింద్ తీరు నచ్చక అసెంబ్లీ ఎన్నికల ముంగిట చాలా మంది పార్టీ వీడి ఇతర పార్టీల్లో చేరారు. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతున్నది.
అర్వింద్ వ్యవహార శైలిపై గతంలోనే ఢిల్లీ పెద్దలు తీవ్ర స్థాయిలో మండిపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ తీరు మార్చుకోకపోగా సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తుండడంతో వారంతా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు చేశారు. లోక్సభ ఎన్నికల ముంగిట వరుసగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతుండడంతో అధిష్టానం ఆయనపై దృష్టి సారించినట్లు తెలిసింది. సరిగ్గా రెండు, మూడు వారాల్లోనే సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉండడంతో టికెట్ వస్తుందా.. రాదా? అన్న మీమాంసలో నిజామాబాద్ ఎంపీ కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కన్నా ఎక్కువగా ఢిల్లీలోనే ఎక్కువగా కాలం గడుపుతూ ఢిల్లీ పెద్దలను మచ్చిక చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక నిజామాబాద్ జిల్లా బీజేపీ ఆఫీస్ వద్ద, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద గతేడాది జూలైలోనే అర్వింద్ను బీజేపీ నుంచి బహిష్కరించాలంటూ ధర్నాలు జరిగాయి. ఇప్పుడు మరోమారు జగిత్యాల వాసులు స్టేట్ ఆఫీస్కు వద్ద ఆందోళనలు చేస్తుండగా, ఒకరైతే శుక్రవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అర్వింద్ హఠావో… బీజేపీకో బచావో అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగిత్యాల వాసులు చేసిన ధర్నాకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను నిజామాబాద్లోనూ బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
అర్వింద్పై ప్రజల్లోనే కాదు.. సొంత పార్టీలోనూ వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే రాష్ట్ర కార్యాలయంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. పార్టీ ఆఫీసులోనే ఓ వ్యక్తి ఏకంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. తాజాగా అర్వింద్కు వ్యతిరేకంగా కరపత్రాలు సోమవారం ప్రచారంలోకి వచ్చాయి. ‘నియంత ధర్మపురి అర్వింద్ వద్దు’ అని రాసి ఉన్న కరపత్రాలు జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి తదితర పట్టణాల్లో వెలుగు చూశాయి. ‘కూలింగ్ గ్లాసులు తీయడు, కారు దిగడు, ప్రజలతో మాట్లాడడు.. ఇంతటి అహంకారి నియంత అర్వింద్ ఎంపీగా మాకొద్దని’ ఆయా పత్రాల్లో ప్రచురించారు. దీంతో అర్వింద్ వైఖరిపై మరోమారు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు, ఈ కరపత్రాలపై ఎంపీ అర్వింద్ సోషల్మీడియా వేదికగా స్పందించారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఆయన తమ్ముడు చేయించిన పని అని పేర్కొన్నారు.
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, అన్నిచోట్లా అర్వింద్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆర్మూర్లో వినయ్రెడ్డి, సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ వంటి వారు ఆయన వల్ల ఇబ్బంది పడిన వారే. ఈ జాబితాలో నిజామాబాద్ అర్బన్లో యెండల లక్ష్మీనారాయణ ఉండగా, తాజాగా బస్వా లక్ష్మీ నర్సయ్య కూడా చేరారు. బోధన్లో మోహన్రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకోవడంపై పార్టీలోనే అసమ్మతి స్వరాలు చెలరేగాయి. అప్పటిదాకా పార్టీ కోసం తీవ్రంగా శ్రమించిన మేడపాటి ప్రకాశ్రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. నిజామాబాద్ రూరల్లో దినేశ్రెడ్డికి పెత్తనం ఇచ్చి జిల్లా అధ్యక్షుడిని చేయడంతో మిగిలిన వారంతా మండిపడుతున్నారు. ఇదే పరిస్థితి బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లోనూ నెలకొంది. అసంతృప్త నేతలంతా ఏకమై ఇప్పటికే జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో అర్వింద్కు టికెట్ ఇస్తే తామంతా పని చేయమంటూ హెచ్చరించగా, కొందరైతే తమ పేర్లను పరిశీలించాలని దరఖాస్తులు కూడా చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో కాషాయ కండువా కప్పుకున్న అర్వింద్ అధిష్టానం పెద్దల ఆశీస్సులతో టికెట్ సంపాదించుకున్నాడు. అప్పటివరకు జెండాలు మోసిన వారంతా మిన్నకుండి పోగా, పార్టీలో ప్రాధాన్యం దక్కుతుందని ఆశించిన వారు భంగపడ్డారు. ఎంపీగా గెలిచిన తర్వాత అర్వింద్ పెత్తనమే పెరగడం, పాత తరం నాయకత్వం మూలకు పరిమితం కావడంతో కింది స్థాయి శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో తాళం చెవి కూడా పాత తరం నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు.