ఇందూరు, అక్టోబర్ 28: నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సకల సదుపాయాలతో ధాత్రి టౌన్షిప్ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. మొత్తం 76 ఎకరాల 22 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ టౌన్షిప్లో తొలి విడుతలో 80 ప్లాట్ల విక్రయానికి నవంబర్ 14,15వ తేదీల్లో వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆయన నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రీ బిడ్డింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఔత్సాహికులకు టౌన్షిప్ ప్రత్యేకతలతోపాటు ప్లాట్ల వేలంపై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి వారి సందేహాలను నివృత్తి చేశారు.
నిజామాబాద్ నగరంలో ప్రభుత్వం తొలిసారిగా సకల సదుపాయాలతో మోడల్ టౌన్షిప్ను ఏర్పా టు చేస్తుందని, సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఔత్సాహికులకు ఇది ఒక మంచి అవకాశమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మొదటి దశలో 80 ప్లాట్ల విక్రయం కోసం నవంబర్ 14, 15వ తేదీల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి వేలం నిర్వహించనున్నట్లు వివరించారు. ఒక చదరపు గజానికి కనీస ధర రూ.ఎనిమిది వేలు నిర్ణయించినట్లు తెలిపారు. బీటీ రోడ్లు, మిషన్ భగీరథ ద్వారా నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజీలు, ప్రహరీతోపాటు 60 ఫీట్ల అప్రోచ్ రోడ్డు, 30, 40 ఫీట్ల అంతర్గత రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
ప్లాట్ కొనుగోలు చేసిన వారికి బ్యాంకురుణ సదుపాయం
టౌన్షిప్లో ప్లాట్లు కొనుగోలు చేసేవారు ముందుగా ఈఎండీ ధరావత్తు కింద కలెక్టర్, నిజామాబాద్ పేరిట రూ.10 వేల డీడీ తీయాలని సూచించారు. వేలం ప్రారం భం కావడానికి ముందు డీడీని సంబంధిత అధికారికి అందజేసి వేలంలో పాల్గొనవచ్చన్నారు. ఇదివరకు రాజీవ్ స్వగృహ పథకంలో దరఖాస్తు చేసుకుని రూ.మూడువేల రుసుము చెల్లించిన వారు దాని రశీదును సమర్పించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలంలో ప్లాట్ దక్కించుకోలేని పక్షంలో ఈఎండీ మొత్తాన్ని వాపస్ చేస్తామన్నారు. ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ కొనుగోలు చేసిన వారికి బ్యాంకు ద్వారా రుణ సదుపాయం పొందే వెసులుబాటు ఉందన్నారు. ఒకే విడుతలో మొత్తం రుసుము చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి ప్లాట్ ధరలో రెండు శాతం రుసుమును ప్రభుత్వం వెనక్కి ఇస్తుందన్నారు. ప్రశాంతమైన వాతావరణం, అనుకూలమైన ప్రదేశంలో అన్ని హంగులతో ఏర్పాటు చేస్తున్న ధాత్రి టౌన్షిప్లో ప్లాట్లను దక్కించుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. టౌన్షిప్కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా వ్యవసాయ భూములు కలిగి ఉన్న రైతులు స్థలాన్ని అందించేందుకు ముందుకువస్తే.. ప్రభుత్వ ఖర్చుతోనే డబుల్ బీటీ రోడ్డు నిర్మాణతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తామన్నారు. దీంతో రైతుల భూముల ధర రెట్టింపు అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆర్డీవో రవి, రూరల్ తహసీల్దార్ అనిల్, టీఎస్ఐఐసీ జిల్లా జనరల్ మేనేజర్ రాందాస్ పాల్గొన్నారు.