బాన్సువాడ జనసంద్రమైంది. జయహో రామన్న, జయ జయహో శీనన్న నినాదాలతో హోరెత్తింది. బుధవారం బాన్సువాడకు విచ్చేసిన మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పట్టణంలో చేపట్టిన రూ.135 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఐటీ, పురపాలక శాఖ మంత్రి రామారావు ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బగ్గీని నడుపుతూ బాన్సువాడ పురవీధుల్లో పర్యటించిన ఆయన.. ప్రజలు వేలాదిగా తరలివచ్చిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సభాపతిపై ప్రశంసలు కురిపించారు. పది వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు అందించారని అభినందించారు. సీఎం కేసీఆర్ లక్ష్మీపుత్రుడిగా పిలుచుకునే పోచారం శ్రీనివాసరెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
– నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బాన్సువాడ
బాన్సువాడ గతంలో ఎట్లుండే.. ఇప్పుడెట్లుంది. తొమ్మిదిన్నరేండ్లలో ఎంతగా బాగుపడిందోప్రజలంతా ఆలోచించాలె. 24 గంటల కరెంట్ కావాలన్నోళ్లు పోచారానికి ఓటేయ్యాలి. ఇటు దిక్కు పోచారం రూపంలో రైతుబంధు ఉన్నడు. 24 గంటల కరెంట్, 73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చినోడు. అటు రేవంత్రెడ్డి రూపంలో రాబంధు ఉన్నడు. ఎవరు కావాల్నో ఆలోచన చేయాలి. ఇటు కన్నీళ్లు తుడిచే ఆత్మబంధువు. అటు చావకొట్టిన కాంగ్రెసోడు. ఎటు దిక్కున ఉండాలో ప్రజలు ఆలోచన చేయాలె. అభివృద్ధి వైపు నిలబడాలె.’
– మంత్రి కేటీఆర్
అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రజలు, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి తదితరులు మంత్రి కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. మూడున్నర గంటలపాటు సాగిన మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా తొమ్మిది అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మార్కెట్ ఆవరణలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. రూ.10వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్కు పోటీయే లేదు..
బాన్సువాడ, అక్టోబర్ 4: రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారం చేపట్టబోతున్నదని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పోటీయే లేదన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రంలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఇందుకు బాన్సువాడ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో జరిగిన అభివృద్ధి తీరే నిదర్శనమని పేర్కొన్నారు. దాదాపు రూ.10వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గం అద్భుతంగా మారిందన్నారు. ఇంతటి అభివృద్ధి గతంలో ఎన్నడూ ఏ నియోజకవర్గంలోనూ జరగలేదన్నారు. బాన్సువాడలో నిర్వహించిన ఆత్మీయ కృతజ్ఞతా సభ విజయవంతమైందని, సభకు వచ్చిన జనాన్ని చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు మైండ్బ్లాక్ అయ్యిందన్నారు. మంత్రి కేటీఆర్ ఆశించిన మేరకు లక్ష మెజారిటీని ఈ ఎన్నికల్లో పోచారం శ్రీనివాస రెడ్డికి కట్టబెట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కృతజ్ఞతా సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
జనసంద్రమైన బాన్సువాడ..
బాన్సువాడరూరల్/బాన్సువాడటౌన్/నస్రుల్లాబాద్, అక్టోబర్ 4: బాన్సువాడ పట్టణంలోని వీక్ల్లీ మార్కెట్ మైదానంలో నిర్వహించిన ఆత్మీయ కృతజ్ఞతా సభకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. నియోజకవర్గంలోని 9 మండలాల నుంచి భారీగా పాల్గొన్నారు. వివిధ రవాణా మార్గాల్లో స్వచ్ఛందంగా వచ్చి బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డికి మద్దతు తెలిపారు. సభకు హాజరైన దాదాపు లక్ష మంది జనమంతా లబ్ధిదారులే కావడం విశేషం. అడుగడుగునా కేసీఆర్, కేటీఆర్, స్పీకర్ పోచారం కటౌట్లు.. గులాబీ జెండాలు, తోరణాలతో పట్టణమంతా గులాబీమయమైంది. చాలా మంది పట్టణవాసులు స్వచ్ఛందంగా తమ వ్యాపార, వాణిజ్య దుకాణాలను మూసేసుకొని బీఆర్ఎస్ బహిరంగ సభకు తరలివెళ్లారు.
బగ్గీ నడిపిన కేటీఆర్…
బాన్సువాడ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా బగ్గీ(బ్యాటరీ వాహనం) నడుపుతూ సరదాగా గడిపారు. మొత్తం తొమ్మిది కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, బ్యాటరీ వాహనంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, పోచారం సురేందర్ రెడ్డిని ఎక్కించుకొని కలియతిరిగారు. దాదాపు ఐదారు కిలో మీటర్ల మేర బాన్సువాడ పట్టణంలో కేటీఆర్ బగ్గీ వాహనం నడుపుతూ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ పట్టణంలో పర్యటించారు.