హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): క్రూడాయిల్, పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తులు, వాటి ధరలు వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేలా కేంద్రప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం గురువారం ఢిల్లీలో చైర్మన్ తటారే సునీల్ దత్తాత్రే అధ్యక్షతన సమావేశమైంది. సమావేశానికి ఎంపీ రవిచంద్ర హాజరై కీలక సూచనలు చేశారు.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, సంబంధిత ఉత్పత్తుల సరఫరాలో అంతరాయం కలుగకుండా చూసేందుకు పటిష్టమైన చర్యలు ఉండాలని వద్దిరాజు అన్నారు. వీటి ధరలు తరచూ పెరుగడం వల్ల నిత్యావసరాల ధరలపై ప్రభావం పడుతున్నదని, సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.