ఎల్లారెడ్డి, అక్టోబర్ 7: ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. శనివారం ఆయన నాగిరెడ్డి పేట మండలంలోని పలు గ్రామాల్లో జీపీ భవనాలు, తారు రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. సదాశివనగర్ మండల కేంద్రంతో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన, భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసి చూపించారన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేశారని, త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. నియోజక వర్గంలో ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాశీ నారాయణ, జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఎంపీపీ రాజ్దాస్, నాయకులు వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి, మురళి, గుర్రాల సిద్ధయ్య, పలు గ్రామాల సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.