భిక్కనూరు, మార్చి 19 : వడగండ్లు పడి నాలుగు రోజులు గడిచినా పంటనష్టం అంచనా వేసేందుకు అధికారులు రాకపోవడంతో రైతులు మండిపడ్డారు. లక్షలు పెట్టుబడి పెట్టిన పంట అకాల వర్షంతో దెబ్బతింటే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే నష్టం అంచనా ఎలా వేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం అంతపల్లి శివారులోని హైవేపై అంతపల్లి, రామేశ్వర్పల్లి, లక్ష్మీదేవునిపల్లి, తిప్పాపూర్, జంగంపల్లి, తలమడ్ల గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. రెండు గంటలపాటు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించడంతో ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పలువురు రైతులు మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వరి, మక్కజొన్న, బొప్పాయితోపాటు కూరగాయలు సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. అకాలవర్షం కురిసిన నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయలేదని, రైతులంటే అంత చులకనా అంటూ దెబ్బతిన్న పంటలను చూపిస్తూ మండిపడ్డారు. రైతులంటే చిన్నచూపా.. మా గోస మీకెలా అర్థమవుతుందన్నారు. పంటల సాగుకోసం పెట్టిన పెట్టుబడులతోపాటు చేసిన కష్టం వృథా అయి రోడ్డునపడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం పంట నష్ట పరిహారం ప్రకటించే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని బీష్మించుకూర్చున్నారు.
విషయం తెలుసుకొని జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ అపర్ణ, ఏవో రాధారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై సాయికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపించామని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలుపగా.. పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా జాతీయ రహదారిపై పోలీసు బలగాలను మోహరించారు. అనంతరం డీఎస్పీ నాగేశ్వర్రావు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ రేపటి వరకు నష్టపరిహారం ప్రకటించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామన్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో శ్రీనివాస్రెడ్డి బాధిత రైతులతో మాట్లాడి వ్యవసాయాధికారులను గ్రామాలకు పంపించి నష్టం వివరాలను సేకరిస్తామని, కలెక్టర్తో సంప్రదించి ప్రభుత్వానికి నివేదిక తయారు చేసి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను ఆర్డీవోకు అందజేశారు.
నా పేరు గోపాల్. మాది అంతంపల్లి. నేను మూడు ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో మక్కజొన్న సాగు చేసిన. నాలుగు రోజుల కిందట వడగండ్ల వాన కురవడంతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. చేతికొచ్చే సమయంలో అకాల వర్షం నట్టేట ముంచింది. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
నా పేరు రాములు. మాది అంతంపల్లి. ఐదు ఎకరాల్లో వరి, నాలుగు ఎకరాల్లో మక్కజొన్న పంట వేసిన. వడగండ్ల వానతో చేతికి వచ్చిన పంట నేలకొరిగింది. పంటలు దెబ్బతిని నాలుగు రోజులు గడుస్తున్నా ఏ అధికారీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల గోసను పట్టించుకొని నష్టపరిహారం అందించాలి.