DOST | డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ కోసం ఈ నెల 16 నుంచి దోస్త్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి దోస్త్ అడ్మిషన్ ప్రక్రియను అత్యంత సులభతరం చేశారు. విద్యార్థులు ఇంట్లో నుంచే రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు పెట్టుకొనే అవకాశం కల్పించారు. మొత్తం మూడు విడుతల్లో సీట్లు కేటాయించనున్నారు. దోస్త్ ద్వారా రాష్ట్రంలో తమకు ఇష్టమైన కళాశాల, కోర్సులో చేరే సౌలభ్యం లభిస్తుంది. గతంలో డిగ్రీ ప్రవేశాలకు విద్యార్థి ప్రతి కళాశాలకు వెళ్లి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేవారు. కానీ, ఇప్పుడు దోస్త్ విధానం ద్వారా అన్ని కళాశాలలు, కోర్సుల వివరాలను తెలుసుకునే అవకాశం ఉన్నది.
2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1142 కళాశాలలు ఉండగా 132 ప్రభుత్వ, 1010 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 4 ప్రభుత్వ కళాశాలలు, 17 ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులు దోస్త్ విధానంలో అడ్మిషన్లు పొందే అవకాశం కల్పించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు మొత్తం 50 వరకు ఉన్నాయి.
దోస్త్కు దరఖాస్తు చేసుకునే సమయంలో మొదట విద్యార్థి తన మొబైల్ నంబర్ను ఆధార్కార్డుతో ఈ సేవా కేంద్రంలో లింక్ చేయించాలి. అనంతరం వెబ్సైట్లో https://dost.cgg.gov.in/ ను ఓపెన్ చేసి క్యాండెట్ ప్రీ రిజిష్ర్టేషన్లో సమాచారాన్ని నమోదు చేస్తే.. ఆధార్ లింక్ ఉన్న మొబైల్కు ఓటీపీ నంబర్ వస్తుంది. నంబర్ను నమోదు చేసిన తర్వాత దోస్త్ ఐడీతోపాటు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఆధార్ నంబర్ లింక్ లేని విద్యార్థులు సహాయ కేంద్రాల (హెచ్ఎల్సీ) ద్వారా దోస్త్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200ను క్రెడిట్,డెబిట్,ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. డబ్బులు చెల్లించిన అనంతరం ఆధార్లింక్ ఉన్న మొబైల్కు ఐదు అంకెల పిన్ వస్తుంది. ఈ పిన్ నంబరు మొదట వచ్చిన ఐడీ నంబర్ ఆధారంగా లాగిన్ అయిన తర్వాత దరఖాస్తులో అడిగే పూర్తి సమాచారాన్ని పొందుపరచాలి. అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్లు కనిపిస్తాయి. దీంతో విద్యార్థులు తమకు నచ్చిన అంశాలను ఎంచుకోవాలి. ఈ సంవత్సరం దోస్త్ పేమెంట్ను టీ-వాలెట్ యాప్ ద్వారా కూడా చెల్లించే అవకాశం కల్పించారు. దీనికి ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు.
దోస్త్ ఆన్లైన్ ద్వారా విద్యార్థి ప్రతి యూనివర్సిటీకి వెళ్లకుండా ఎక్కడి నుంచైనా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా విద్యార్థులకు ఇష్టమైన కళాశాల, కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ను ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 9949306121, 9959968465 నంబర్లను సంప్రదించవచ్చు.
– కిష్టయ్య, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, దోస్త్ కోఆర్డినేటర్ కామారెడ్డి
మొదటి విడుత రిజిస్ట్రేషన్ (ఫీజు రూ.200)
16.05.2023 – 10.06.2023
వెబ్ ఆప్షన్లు – 20.05.2023 – 11.06.2023
సర్టిఫికెట్ల పరిశీలన (పీహెచ్/సీఏపీ) – 08.06.2023
సర్టిఫికెట్ల పరిశీలన (ఎన్సీసీ/ఇతరములు) – 09.06.2023
మొదటి విడుత సీట్ల కేటాయింపు – 16.06.2023
సెల్ఫ్ రిపోర్టింగ్ – 16.06.2023- 25.06.2023
రెండో విడుత రిజిస్ట్రేషన్ (ఫీజు రూ.400)
16.06.2023 – 26.06.2023
వెబ్ ఆప్షన్లు – 16.06.2023 – 27.06.2023
సర్టిఫికెట్ల పరిశీలన (పీహెచ్/సీఏపీ/ ఎన్సీసీ) – 26.06.2023
రెండో విడుత సీట్ల కేటాయింపు – 30.06.2023
ఆన్లైన్ / సెల్ఫ్ రిపోర్టింగ్ – 01.07.2023- 05.07.2023
మూడో విడుత రిజిస్ట్రేషన్ (ఫీజు రూ.400)
01.07.2023 – 05.07.2023
వెబ్ ఆప్షన్లు – 01.07.2023 – 06.07.2023
సర్టిఫికెట్ల పరిశీలన (పీహెచ్/సీఏపీ/ ఎన్సీసీ) – 05.07.2023
మూడో విడుత సీట్ల కేటాయింపు – 10.07.2023
సెల్ఫ్ రిపోర్టింగ్ – 10.07.2023- 15.07.2023