అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు లక్ష్యం
దళితబంధు యూనిట్ల పంపిణీలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
వేల్పూర్, మే 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దళితబంధు పథకం కింద తొలి విడుతలో ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ లబ్ధిదారులకు వేల్పూర్ ఎక్స్రోడ్డులోని మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో యూనిట్లను మం త్రి వేముల గురువారం పంపి ణీ చేశారు. ఇదివరకే 86 మందికి వివిధ యూనిట్లను అందజేయగా, గురువారం 14 మందికి వారు ఎంచుకున్న యూనిట్లను అం దజేశారు. వీటితోపాటు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన 64 మందికి కుట్టు మిషన్లు (రెండు చొప్పున) పంపిణీ చేశారు. మరో 15 మందికి రూ.50వేల చొప్పున వందశాతం సబ్సిడీ రుణాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడిచిన 60 ఏండ్లలో దళితులను ఓటు బ్యాంకుగా వినియోగించుకోవడం తప్ప వారికి ప్రభుత్వాలు ఎటువంటి ప్రయోజనాలను చేకూర్చలేదన్నారు. సీఎం కేసీఆర్ దళిత కుటంబాల స్థితిగతుల్లో సమూల మార్పులు తేవాలనే సంకల్పంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఇలాంటి పథకం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రభుత్వ తోడ్పాటుతో వ్యాపారాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, డీసీవో సింహాచలం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.