దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.10లక్షలు అందించి పలు యూనిట్ల ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు దళిత కుటుంబాలు యూనిట్లు ఏర్పాటు చేసుకొని లబ్ధిపొందుతున్నాయి. తమతోపాటు మరికొద్ది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాయి.
ఆర్మూర్, ఏప్రిల్ 19: దళితోద్ధరణకు దూరదృష్టితో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. గతంలో వెనుకబాటుకు గురైన ఎస్సీలు సర్కారు తోడ్పాటుతో ఇప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచమే గర్వించేలా నెలకు లక్షలు సంపాదిస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు. మొన్నటి దాకా ఉపాధి లేక బిక్కుబిక్కుమంటూ గడిపిన కుటుంబాల్లో ఇప్పుడు దళితబంధు వెలుగులు విరజిమ్ముతున్నాయి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో దళితబంధు పథకానికి 100 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన ఒక్కొక్కరికీ రూ.10లక్షల చొప్పున రూ.10కోట్లను అందజేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారు కార్లు, ఫుట్వేర్, ఫొటో ఆల్బమ్ షాపులు, విత్తన, ఎరువుల దుకాణాలు, బట్టల దుకాణాలు, ట్రాక్టర్లు, హోటళ్లు, సెల్ఫోన్ దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు , చిన్నతరహా వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని తమ కాళ్లపై తాము నిలబడి సమాజంలో ఆర్థికంగా ఎదుగుతున్నారు.
దళితబంధుతో ఆర్థిక ఎదుగుదల
రాష్ట్ర ప్రభుత్వం దళితులను రాజులుగా చేసేందుకు తీసుకువచ్చిన పథకం దళితబంధు. ఈ పథకంతో దళితులు ఆర్థికంగా ఎదుగుతున్నారు. దళితబంధు పథకంలో కారు పొందాను. దానిని అద్దెకు ఇచ్చాను. ప్రతినెలా రూ.30వేల ఆదాయం వస్తున్నది. దీంతో నా కుటుంబం ఆనందంగా బతుకుతున్నాం. ఇంత మంచి పథకాన్ని దళితులకు అందించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
-కొక్కెర భూమన్న, ఆర్మూర్
ఖాళీగా తిరిగేవాడ్ని..ఇప్పుడు కారు ఓనర్ను….
గతంలో ఏ పనీ లేక ఖాళీగా తిరిగేవాడిని. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో కారు వచ్చింది. నేనే స్వయంగా కారు నడుపుతున్నాను. ప్రతినెలా రూ.30వేల నుంచి రూ.40వేల వరకు సంపాదిస్తున్నాను. ఇప్పుడు మా కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వాలు దళితుల గురించి ఆలోచించలేదు. కేసీఆర్ ప్రభుత్వమే దళితులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. దళితబంధులో ఎంపిక చేసి నాకు మంచి జీవితాన్ని అందించారు.
-మ్యాదరి నరేశ్, మామిడిపల్లి
పిలిచి ఇవ్వడం గొప్ప విషయం….
గతంలో లక్ష, రెండు లక్షల లోన్ కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా పట్టించుకున్న వారు లేరు. దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పిలిచి రూ.10లక్షలు ఇవ్వడం గొప్ప విషయం. గతంలో నాకు పెర్కిట్లో చిన్న షాపు ఉండేది. దళితబంధు ద్వారా రూ.10లక్షలు ఇవ్వడంతో దాంట్లో మరికొంత డబ్బులు కలిపి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద మొత్తంలో పుట్వేర్ షాపును ఏర్పాటు చేశాను. ప్రతి నెలా అన్ని ఖర్చులు పోను రూ.15నుంచి రూ.20వేల ఆదాయం పొందుతున్నాను. ఇంతటి పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-దశరథ్, పెర్కిట్