Cyber fraud | నస్రుల్లాబాద్ జూన్ 7: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బీర్కూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు రూ.95వేలు పోగొట్టుకున్నాడు. బీర్కూర్ గ్రామానికి చెందిన మజార్ అనే యువకుడు బీర్కూర్ లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మే నెల 2న వాట్సాప్ గ్రూపులో ఆర్టీవో చలాన్ లింక్ వచ్చింది. యువకుడు ఆ లింక్ ని ఓపెన్ చేసి లింక్ అడిగిన వివరాలను నమోదు చేశాడు.
జూన్ 3న తన ఖాతాలో రూ. లక్ష నగదును జమ చేశాడు. జూన్ 6న సాయంత్రం యువకుడి ఖాతాలో నుండి ఆరు దఫాలుగా మొత్తం రూ.95 వేల నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. నగదు పోయిన వివరాలు మెసేజ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బీర్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, 1930కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.