కామారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రైతులు ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తుండగా, పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు. రైతన్నల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, వారికి అండగా నిలుస్తున్నా, వారి ని చివరిక్షణంలో అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంటల సీజన్ను నెల రోజులు ముందుకు జరపాలని ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. పంటకాలాన్ని ముందుకు జరిపితే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. గత ఐదేండ్లలో కురిసిన అకాల వర్షాల తీరును పరిశీలిస్తే నవంబర్ నెలలో వచ్చే తుపాన్లు, ఏప్రిల్ నెలలో కురిసే అకాల వర్షాలను బట్టి ఇది స్పష్టమవుతున్నది. దీంతో జిల్లాల్లో అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. స్వయానా రైతు అయిన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా, ముందు తన నియోజకవర్గంలో ఇటీవలే రైతుల కు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలను తప్పించలేం కానీ పంట కాలాన్ని ముందుకు జరుపుకోవడం మన చేతిలో పని అని, తద్వారా పంటలను కాపాడుకోవచ్చని, వానకాలం పంటల సాగుకు మే నెల చివర్లో లేదా జూన్ 15 లోపు రోహిణి కార్తెలోనే నార్లు పోసుకోవాలని, 125 నుంచి 130 రోజుల పంట కాలంతో అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే తుపాన్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చని పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూ చించిన విషయం విదితమే. స్పీకర్ సూచనలతో బాన్సువాడ నియోజకవర్గంలో వానకాలం సీజన్ కోసం అన్నదాతలు సన్నద్ధం అవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించేందుకు ముందస్తుగా నాట్లు వేయించడమే ప్రభుత్వ లక్ష్యమైంది. వానకాలం లో జూన్ 15లోగా నారు పోసుకొని జూలై 15లోగా నాట్లు పూర్తి చేసేలా, యాసంగిలో నవంబర్ 15లోగా నారు పోసుకొని డిసెంబర్ 15లోగా నాట్లు వేసేలా రైతులను చైతన్యవంతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో పంటల సాగుకు సర్వం సిద్ధం
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ సారి మే నెలాఖరులోపు రైతులు నార్లు వేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులకు జీలుగ విత్తనాలు అందిస్తూ, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలో ఏయే రకాల పంటలు సాగవుతాయి, వాటికి సాగునీరు అందుతుం దా, విత్తనాలు ఎన్ని అవసరం ఉంటాయో అంచనాను పూర్తి చేశారు. వ్యవసాయ రంగానికి పుష్కలంగా నీరందుతున్న నేపథ్యంలో గత సీజన్తో పోలిస్తే ఈ వానకాలంలో సాగు విస్తీర్ణం పెరగనున్నది. గత వానా కాలంలో 5.16లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయగా, ఈ సీజన్లో అదనంగా సుమారు 20వేల ఎకరాల్లో, అంటే 5.36లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వరి సుమారు 2,48,150 ఎకరాల్లో, మక్కజొన్న 86,205, చెరుకు 4100, జొన్న 300, పత్తి 73,545, సోయా 72,878, కందులు 22,151, పెసర్లు 10,900,మినుము 10,500 ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచ నా వేశారు. దీని కోసం అన్ని రకాల పంటలకు కలిపి సుమారు లక్ష క్వింటాళ్ల విత్తనాలు అవసరముంటాయని అధికారుల అంచనా. వరి పంట కోసం 60,313 క్వింటాళ్ల విత్తనాలు, సోయాబీన్ 70,256, శనగ 18083, మక్క జొన్న 4667, జొన్న 254, కందులు 1054 క్వింటాళ్ల విత్తనాలు, పత్తికి 70256 ప్యాకెట్లు అవసరం. 65శాతం సబ్సిడీపై 6,125 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను జిల్లాలోని 83 సహకార సంఘాల ద్వారా అందజేస్తున్నారు. జిల్లాలోని రైతులకు సుమారు 54వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటికే 18వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది.
నిజాంసాగర్ ఆయకట్టు కింద వరి నాట్లు
స్వల్పకాలిక పంట అయిన వరి సాగుకు నిజాంసాగర్ ఆయకట్టు అనుకూలంగా ఉన్నది. ఈ ప్రాజెక్టులో సింగూరుతో పాటు తాజాగా కాళేశ్వరం ప్యాకేజీలోని కొండపోచమ్మసాగర్ నుంచి పుష్కలంగా నీరు వస్తుండడంతో ప్రాజెక్టు నిండు కుండలా ఉండి, ఆయకట్టు కింద ఉన్న పొలాలకు రెండు పంటలకు నీరందిస్తోంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడం, ఉచిత విద్యుత్తో రైతులు సునాయసంగా పంటలను సాగు చేస్తున్నారు. ముంద స్తు సాగు విజయవంతమైతే రైతులు అకాల వర్షాల బారిన పడి పంటలను కోల్పోయే పరిస్థితి ఉండదు.
వర్షాలు సహకరిస్తే నారు పోస్తాం
జూన్ మొదటి వారంలో వర్షాలు కురిస్తే నారు పోసుకొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ నిర్ణ యం ప్రకారం మేము పంటల సాగును ముందుకు జరపడానికి సిద్ధం. నారు పోసుకొంటే నీరు అవసరం. మిషన్ కాకతీయతో చెరువుల్లో పుష్కలంగా నీరుంది. అధికారులు సహకరిస్తే మేం పంటకాలాన్ని ముందుకు జరుపుకొంటాం. దీంతో రైతులకు లాభమే జరుగుతుంది.
–భూమయ్య, రైతు, వడ్లూర్
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
ప్రకృతి వైపరీత్యాలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రైతులు ముందస్తు పంటలను సాగు చేసే లా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. వాన కాలం సీజన్ను ఒక నెల ముందుకు జరిపితే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం సాగునీరు ఇవ్వడానికి, విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. రైతులు వెంటనే వ్యవసాయ పనులను ప్రారంభించుకోవాలి. జూన్ 15 లోపు నార్లు పోసుకోవాలి. జూలై 15లోపు నాట్లు వేయాలి.
– వీరస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి