పొతంగల్/వేల్పూర్/ ఏర్గట్ల, ఫిబ్రవరి 24: నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న మక్కజొన్న పంట నేలకొరగగా, వేల్పూర్మండలంలోని పలు గ్రామాల్లో మార్కెట్కు తరలించడానికి సిద్ధంగా ఉంచిన పసుపు, జొన్నలు తడిసిపోయాయి. పొతంగల్ మండలంలోని కొడిచర్ల, ఏర్గట్ల మండ లం తొర్తి గ్రామ శివారులో ఉన్న మక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మరో 15 నుంచి 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట గాలివాన బీభత్సానికి వాలిపోయింది.
దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటకు విత్తనాలు, ఎరువులు, కూలీలు వంటి భారీ పెట్టుబడి పెట్టిన రైతులు అకాలంగా వచ్చిన గాలులకు పంట నష్టపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బాగా పండడంతో దిగుబడి వస్తుందన్న ఆశతో ఉన్న రైతులకు.. ఒక్కసారిగా వీచిన గాలి పంటలను దెబ్బతీసింది. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి నష్టపోయిన తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పొతంగల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి సుప్రియ నేలకొరిగిన పంటలను పరిశీలించారు. అక్కడున్న రైతులను వివరాలు అడిగి తెలుసుకుని ప్రాథమిక అంచనాగా సుమారు 20 నుంచి 25 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు.