Rice Mill | నిజామాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రైస్మిల్లులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ధాన్యం స్వీకరించి నిబంధనల మేరకు మర ఆడించిన బియ్యాన్ని తిరిగి ఇవ్వడంలో వైఫల్యం చెందిన రైస్ మిల్లుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల్లో ధాన్యాన్ని పక్కదారి పట్టించి బియ్యం సరఫరాలో చేతులెత్తేసిన రైస్ మిల్లుల యాజమాన్యాలపై ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జగదీశ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. సమయానికి సీఎంఆర్ అందించకుండా తాత్సారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేర కు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. సీఎంఆర్ ఇవ్వడంలో జాప్యం చేసే వారికి భవిష్యత్తులోనూ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో అలాంటి వారికి ధాన్యం కేటాయింపులు సైతం ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. రైస్మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో మిల్లుల రైస్మిల్లుల యాజమాన్యాల్లో వణకుమొదలైంది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతుండగా.. ఇప్పటి వరకు ఎనిమిది రైస్ మిల్లుల యాజమాన్యాలపై చర్యలకు ఉపక్రమించారు. అధికారికంగా విడుదల చేసిన సమాచారం మేరకు వర్ని మండలంలోనే ఏకంగా ఐదు రైస్ మిల్లుల్లో పేరుకుపోయిన సీఎంఆర్ బకాయిల మేరకు నాలుగు రైస్మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదుచేయడం గమనార్హం. ఇందులో ఎంఎస్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్, రాయల్ ట్రేడింగ్ కంపెనీ, ఎస్ఎఆర్ ట్రేడర్స్, వాసి పారాబాయిల్డ్ రైస్ మిల్, గంగా రైస్ మిల్లులున్నాయి. నిజామాబాద్ రూరల్ మండలంలోని కాలూర్ శివారులో లక్ష్మీ గణపతి నర్సింహ ఆగ్రో ఇండస్ట్రీస్, బోధన్ మండలంలోని శ్రీనివాస నగర్లోని దాదా భాయ్ ఇండస్ట్రీస్, పొతంగల్ మండలం కారేగావ్లోని అర్కామ్ ట్రేడర్స్లపై క్రిమినల్ కేసులు నమోదుచేశారు. మొత్తం ఎనిమిది రైస్ మిల్లుల నుంచి రూ.33 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గంగారైస్ మిల్ నుంచి రూ.8.09 కోట్లు, రాయల్ ట్రేడింగ్ కంపెనీ రూ.6.48 కోట్లు, ఎంఎస్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ రూ.5.05 కోట్ల బకాయిలు ఉన్నాయి.