జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి
ఉమ్మడి జిల్లాలో వెలుగుచూస్తున్న కేసులు
అప్రమత్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
స్వీయ రక్షణే శిరోధార్యం
మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి
ప్రికాషన్ డోసుకు ఫ్రంట్ లైన్ వర్కర్ల వెనుకంజ
ఉమ్మడి జిల్లాలో 40.31 లక్షల మందికి వ్యాక్సినేషన్
జన జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నది. మొన్నటిదాకా స్తబ్ధుగా ఉన్న కొవిడ్.. కొద్దిరోజులుగా విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనూ ఇటీవల ఒకటి, రెండు కేసులు వెలుగుచూశాయి. సోమవారం మరొకరికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్ తీసుకున్నామన్న భరోసాతో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం మానేశారు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించాలన్న సోయి మరిచారు. ఫలితంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నది. వైరస్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు ఇక నుంచైనా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ నిబంధనలు పాటిస్తేనే కొవిడ్ వ్యాప్తిని నిలువరించడం సాధ్యమవుతుంది.
నిజామాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా తెచ్చిన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో వైరస్ మళ్లీ విస్తరిస్తున్నది. భయాలను వీడి స్వేచ్ఛగా బతుకుతున్న ప్రజలకు.. చాప కింద నీరులా విస్తరిస్తున్న కొవిడ్ కలవరపాటుకు గురి చేస్తున్నది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండగా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ ఒకటి, రెండు కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ తరుణంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మొదటి, రెండు, మూడో వేవ్లను తట్టుకుని నిలబడిన జనాలకు కాసింత నిర్లక్ష్యం, నిర్లిప్తత ఆవరించింది. తద్వారా సహజమైన జీవన విధానానికి అలవాటు పడిన వారంతా కరోనా ముప్పును పట్టించుకోవడాన్ని తీవ్రంగా పరిగణించడం లేదు. కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్న దరిమిలా అన్ని వర్గాల వారు మాస్కులు వాడడం, భౌతిక దూరం పాటించడం వంటింటి తప్పనిసరిగా పాటించాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరిస్తున్నది. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుది. ప్రస్తుతం కరోనా కేసుల తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం మరవద్దని వైద్యాధికారులు చెబుతున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.
మూడు డోసులు..
ఏడాది కాలంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. కొవిషీల్డ్, కొవాగ్జిన్తో పాటుగా తాజాగా 12-14 వయస్సు గల వారికి కొర్బెవాక్స్ను సైతం వేస్తున్నారు. పిల్లలకు అందిస్తున్న ప్రత్యేక వాక్సిన్కు మంచి స్పందన లభిస్తున్నది. ఉభయ జిల్లాల్లో దాదాపుగా 75 వేల మంది ఈ టీకా తీసుకున్నారు. ఇక, మొదటి, రెండు డోసులు తీసుకున్న వారిలో భారీ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నది. రెండో డోసును తీసుకునేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నట్లుగా అధికారిక లెక్కలను తెలుస్తున్నది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రభుత్వం ప్రికాషన్ డోసును అందిస్తున్నప్పటికీ, చాలా మంది తీసుకోవడం లేదు.
మహిళలే ఎక్కువ..
వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్యోరాగ్య శాఖ పకడ్బందీగా నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగానే పీహెచ్సీ, సీహెచ్సీలు, ఏరియా దవాఖానలు, జీజీహెచ్లతో పాటుగా ప్రత్యేక కేంద్రాల్లో టీకాలు వేశారు. కొన్ని సందర్భాల్లో ఇంటింటికీ వెళ్లి, పని చేసే ప్రాంతాలకు వెళ్లి మరీ వ్యాక్సిన్లు ఇచ్చారు. అయితే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీకాలు తీసుకున్న వారిలో మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 40,31,717 మందికి వ్యాక్సినేషన్ పూర్తి కాగా, ఇందులో 21,52,992 మంది స్త్రీలు, 18,46,548 మంది పురుషులు ఉన్నారు.
నిజామాబాద్లో దాదాపు పూర్తి..
నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటి వరకు మొత్తం 24,18,194 మంది టీకాలు తీసుకున్నారు. వీరిలో 12,34,081 మంది మొదటి డోసు, 11,68,833 మంది రెండో డోసు తీసుకున్నారు. 15,280 మంది మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారు. ఇక, 20,84,032 మందికి కొవిషీల్డ్, 2,95,580 మందికి కొవాగ్జిన్, 38,282 మందికి కొర్బెవాక్స్ టీకాలు వేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 12-14 వయస్సు వారు 38,582 మంది, 15-17 వయసు వారు 1,11,327 మంది, 18-44 వయస్సు వారు 13,73,151 మంది, 45-60 వయస్సు వారు 5,64,213 మంది, 60 సంవత్సరాలు దాటిన వారు 3,30,741 మంది ఉన్నారు.
కామారెడ్డిలో..
కామారెడ్డి జిల్లాలో మొత్తం 16,13,523 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. 8,06,900 మంది ఫస్ట్ డోసు, 7,90,331 మంది రెండో డోసు తీసుకోగా, 16,292 మంది మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారు. కొవిషీల్డ్ను 13,21,707 మంది, కొవాగ్జిన్ను 2,55,488 మంది, కొర్బెవాక్స్ను 36,328 మందికి ఇచ్చారు. వీరిలో 12-14 వయసు వారు 36,319 మంది, 15-17 మధ్య వయసు వారు 87,355 మంది, 18-44 వయసు వారు 8లక్షల 69వేల 818 మంది, 45-60 వయస్సు వారు 3లక్షల 81వేల 577 మంది, 60 ఏళ్లు దాటిన వారు 2లక్షల 38వేల 453 మంది ఉన్నారు.
అకస్మాత్తుగా అలజడి..
కొవిడ్ తగ్గడంతో 2020 మార్చి నెలకు ముందు నాటి సాధారణ పరిస్థితులు వచ్చాయనే భావనలో ప్రజలు ఉన్నారు. సాధారణ జీవితానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. మొదటి, సెకండ్ వేవ్లతో తీవ్ర ఇబ్బందులకు గురి కాగా, థర్డ్ వేవ్ ఇలా వచ్చి అలా వెళ్లడంతో ప్రజల్లో భయమే కనిపించలేదు. వ్యాక్సిన్ తీసుకున్నందున తమకేమీ కాదులే అనే ధీమాతో ప్రజలు చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. ఫలితంగా వైరస్ జాడ మళ్లీ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మాస్కు తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నది.
జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..
కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా గణాంకాలను చూస్తుంటే అర్థం అవుతున్నది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బయటికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలను పాటించాలి. మాస్కులు వాడడం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా చేతులు శుభ్రం చేసుకోవడం అలవర్చుకోవాలి. వైరస్ సోకిన వారికి తగిన వైద్యం అందించేందుకు దవాఖానల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఫ్రంట్ లైన్ వర్కర్లు చాలా మంది ప్రికాషన్ డోసు తీసుకోలేదు. వారంతా మూడో డోసును తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
– సుదర్శనం, నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి