వినాయక్నగర్, మార్చి 28: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. నిజామాబాద్ నగరంలోని గాయత్రీనగర్ ప్రాంతానికి చెందిన మేడవరపు రాజు (55), మేడవరపు స్వాతి(53) దంపతులు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కొన్ని నెలల క్రితం భార్యాభర్తలు కర్ణాటక రాష్ర్టానికి వెళ్లారు. అక్కడ కొడగు జిల్లా సోమవార్పేట్ పరిధిలోని ఓ లాడ్జిలో జనవరి 4న గదిని అద్దెకు తీసుకున్నారు.
బస చేసిన వారు రెండు రోజులుగా గదిలో నుంచి బయటికి రాకపోవడంతో లాడ్జి నిర్వాహకులకు అనుమానం వచ్చి గదిలోకి చూడగా దుర్వాసన వచ్చింది. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సోమవార్ పేట్ ఎస్సై రమేశ్కుమార్ లాడ్జికి వెళ్లి గది తలుపులను తెరిపించి చూడగా దంపతులిద్దరూ నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.