రామారెడ్డి, జనవరి 16: ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట గ్రామానికి చెందిన గడీల భైరయ్య ఓ ప్రైవేటు న్యూస్ చానల్లో పనిచేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. ఈ క్రమంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులకు మాయమాటలు చెప్పి, భయపెట్టి డబ్బులను డిమాండ్ చేసేవాడు. ఈ క్రమంలోనే జనవరి 11వ తేదీన మధ్యాహ్నం మండలంలోని ఫకీరాతండా రోడ్డు వద్ద జగదాంబతండా గ్రామానికి చెందిన భూక్యా ధూలి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నది. భైరయ్య, ఆయన భార్య భాగ్యలక్ష్మి బైక్పై వస్తూ.. ఆమెను మాట్లాడించారు. ‘నీ భర్త మరణించాడు కదా.. నీకు రూ.40 వేలు వస్తాయి. అందుకు కొంత డబ్బు ఖర్చు అవుతుంది. బైక్ వెనుకాల కూర్చున్న మేడం ఇప్పిస్తారు’ అని భైరయ్య చెప్పాడు. ఆయన మాటలను నమ్మిన ధూలి డబ్బులను తీయగా.. రూ.ఆరు వేలు లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాధితురాలు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు 15వ తేదీన వాహనాలను తనిఖీ చేస్తుండగా.. భైరయ్య – భాగ్యలక్ష్మి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.ఐదు వేలు నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.