ఆర్మూర్ టౌన్, జనవరి 2: ఆర్మూర్ బల్దియా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతాపై ఇటీవల పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో అవిశ్వాస పరీక్షను ఈ నెల 4న చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నాలుగేండ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిచిన పండిత్ వినీతను మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చొరవతో చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. ఆర్మూర్ పట్టణ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు రాజేశ్వర్రెడ్డి చైర్పర్సన్ పండిత్ వినీత, భర్త పవన్, మరిది పండిత్ ప్రేమ్కు అధిక ప్రాధాన్యమిచ్చారు. కానీ పదవిని దుర్వినియోగం చేస్తూ అనేక అవినీతి అక్రమాలు చేశారని చాలా సార్లు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. సొంత పార్టీ కౌన్సిలర్లు సైతం వీరి ఆగడాలపై మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి వివరించారు. ఒక దశలో చైర్పర్సన్ను మార్చాల్సిందేనని పట్టుబట్టారు.
కానీ మాజీ ఎమ్మెల్యే వారిని సముదాయిస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్ భర్త, మరిది బీజేపీకి లోపాయికారిగా పనిచేశారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత చైర్పర్సన్ భర్త బీజేపీలో చేరేందుకు ప్రయత్నించగా ఆ పార్టీ నాయకులు వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇటీవల మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్ద కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు జరపగా, పట్టణ కాంగ్రెస్ నాయకులు సైతం వారి చేరికను వ్యతిరేకించినట్లు తెలిసింది. బల్దియా చైర్పర్సన్ అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసిన మనమే వారిని చేర్చుకుంటే సబబు కాదని ఇరుపార్టీల నాయకులు నాయకత్వానికి చెప్పినట్లు తెలిసింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.