అక్రమాలకు అలవాటు పడ్డ కొందరు సబ్ రిజిస్ట్రార్లు
శాఖాపరమైన చర్యలకూ జంకని వైనం
సర్వేయర్లతో అంటకాగుతూ అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్లు
ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖలో 14 మందిపై పోలీసు కేసులు
తాజాగా మరో సబ్ రిజిస్ట్రార్పై వేటు
రిజిస్ట్రేషన్ శాఖలోని అక్రమార్కుల బాగోతం తరచూ బయట పడుతూనే ఉన్నది. కొంత మంది అధికారులతో ఆ శాఖ పరువు మంట గలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది. అయితే, డబ్బు యావతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది తప్పుదోవ పడుతున్నారు. అక్రమాలకు పాల్పడుతూ అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నా, సస్పెన్షన్ వేటు వేస్తున్నా ఏ మాత్రం వెరవడం లేదు. అవినీతికి పాల్పడడం ఆపడం లేదు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖలోని 14 మందిపై పోలీసు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కొంత మంది సబ్ రిజిస్ట్రార్లపై వేటు పడగా, తాజాగా భీమ్గల్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కావడం చర్చనీయాంశమైంది.
నిజామాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అవినీతిపరుల బాగోతం రిజిస్ట్రేషన్ శాఖకు మాయని మచ్చ తెస్తున్నది. భీమ్గల్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్పై సస్పెన్షన్ వేటు పడడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఐదు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ శాఖలోని ముగ్గురిపై వేటు పడింది. అయినప్పటికీ అక్రమాలు ఆగలేదని తాజా ఘటన రుజువు చేస్తున్నది.
ధరణితో మార్పు..
ధరణి సేవలు ప్రారంభమయ్యే వరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల వ్యవహారంతో సామాన్య ప్రజలు విలవిల్లాడి పోయారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ విషయంలో తిమ్మిని బమ్మిని చేసి రెండు శాఖల అధికారులు దండుకున్నారు. భూమి లేని వ్యక్తికి ఉన్నట్లుగా, భూ యజమానికి భూమి లేనట్లుగా తిరకాసు చేసి ఎందరినో రోడ్డు పాలు చేసిన ఘనత వారికే దక్కింది. అయితే, ప్రజలకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల బదలాయింపు విషయంలో భారీ ఊరటను కలిగించేందుకు సీఎం కేసీఆర్ కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ధరణి పోర్టల్ను 2020, అక్టోబర్ 29న ఆరంభించి వ్యవసాయ భూములను తహసీల్ కార్యాలయంలో క్షణాల్లో పేరు మార్పిడి జరిగేలా చేశారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను యథావిధిగా సంబంధిత శాఖకే అప్పగించారు. పారదర్శకంగా విధులు నిర్వహించాలని రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. కానీ అవినీతికి అలవాటు పడ్డ సబ్ రిజిస్ట్రార్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. వివాదాస్పద వ్యక్తులకే ఉన్నతాధికారులు వంత పాడడంతో ఆ శాఖకు చెడ్డ పేరు వస్తున్నదనే భావన వ్యక్తమవుతున్నది.
లోతైన విచారణ..
భీమ్గల్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ సస్పెన్షన్కు గురికావడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడం, నాన్ లేఅవుట్ దస్తావేజులకు రిజిస్ట్రేషన్లు చేయడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. భీమ్గల్లో ఏడాదిన్నరగా ప్రవీణ్ చేసిన బాగోతాలపై వచ్చిన ఫిర్యాదులపై డీఐజీ మధుసూదన్రెడ్డి విచారణ చేశారు. తప్పు నిజమేనని తేలడంతో పక్కన పెట్టారు. సరిగ్గా ఐదు నెలల క్రితమే నిజామాబాద్లో ముగ్గురు రిజిస్ట్రేషన్ అధికారులపై వేటు పడింది. అంతలోనే మరొకరు అడ్డంగా అవినీతి పాల్పడుతూ దొరకడం కలకలం రేపుతున్నది. గతంలో నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ప్రవీణ్.. కొంత మంది డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై విలువైన భూములను తారుమారు చేసినట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యారు. తాజాగా ఇదే విషయంలో మరోసారి భీమ్గల్లో సస్పెన్షన్కు గురి కావడం విశేషం. ఇతనితో సంబంధాలు నెరిపిన ప్రభుత్వ, ప్రైవేటు సర్వేయర్ల పాత్రపై విచారణ చేయాల్సిందిగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత శాఖకు లేఖ రాసినట్లు సమాచారం.
భయమేది…?
ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో కొద్ది రోజుల క్రితమే బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ ప్రాంతాల్లో శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయం అమలై ఆర్నెళ్లు కూడా గడువక ముందే మరొకరిని విధుల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, అవినీతికి అలవాటు పడిన వారంతా యథాలాపంగా మామూళ్ల జోరులో మునిగి తేలుతున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. గ్రామాలు, పట్టణాల్లో కనీస ప్రమాణాలు పాటించకుండా వెంచర్లు చేసేసి జాగాలను గంపగుత్తగా అమ్ముకుంటున్న వారికి సర్కారు చర్యలతో ముకుతాడు పడింది. వీటిపై రిజిస్ట్రేషన్లు నిషేధం విధించడంతో బహిరంగ మార్కెట్లో నిర్ణీత మార్గదర్శకాలతో ఏర్పాటైన వెంచర్లలోనే ప్లాట్ల క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా సస్పెన్షన్కు గురైన సదరు వ్యక్తి మాత్రం బరితెగించి నిబంధనలను ఉల్లంఘించాడు. నాలా లేని భూములకు సైతం రిజిస్ట్రేషన్ చేయొద్దన్న ఆదేశాలను బేఖాతరు చేశాడు.
అక్రమార్కులకు అందలం..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 10 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. ఇందులో పనిచేస్తున్న వారిలో కొద్ది మంది పలుమార్లు సస్పెన్షన్కు గురై తిరిగి పోస్టింగ్ పొందిన వారు ఉన్నారు. వీరికి కోరుకున్న చోట పోస్టింగ్లు వస్తుండడం విడ్డూరంగా మారింది. భీమ్గల్లో సీనియర్ అసిస్టెంట్కు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ హోదాలో పోస్టింగ్ కట్టబెట్టడంపై హైదరాబాద్ స్థాయిలో చర్చ జరుగుతున్నది. రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నాలుగేండ్ల క్రితం ఇలాంటి అక్రమాలతోనే ప్రవీణ్ను సస్పెండ్ చేశారు. ఆయనకే భీమ్గల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అప్పగించగా మరోమారు సస్పెన్షన్కు గురి కావడంతో రిజిస్ట్రేషన్ శాఖ అభాసుపాలైంది. భూముల విషయంలో ఘర్షణలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం భూమి రికార్డుల నిర్వహణ పద్ధతి(టీఎల్ఆర్ఎంఎస్) నాలుగేళ్ల క్రితం తీసుకొచ్చింది. ఇందులో నమోదు చేసిన వ్యవసాయ భూముల విలువలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కొంత మంది సబ్ రిజిస్ట్రార్లు గందరగోళం చేశారు. క్షేత్ర స్థాయికి భిన్నంగా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. భూ విలువలు తారుమారు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లాభం జరిగేలా వ్యవహరించడంతో ఇందుకు బాధ్యుడైన ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్తో పాటుగా మరికొందరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఉభయ జిల్లాలో అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది మొత్తం 14 మందిపై పోలీసు కేసులు నమోదు కాగా విచారణ సైతం జరుగుతున్నది.
తప్పు చేస్తే కఠిన చర్యలు..
అక్రమాలకు తావు లేకుండా పని చేయాలని ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదు.
– ఫణిందర్, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ