నస్రుల్లాబాద్/బాన్సువాడ, ఆగస్టు 29 : రాష్ట్రంలో ఇస్తున్న మాదిరిగా మరెక్కడా పింఛన్లు ఇవ్వడం లేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయం ఫంక్షన్హాల్లో 513 మంది దివ్యాంగులకు పెరిగిన పింఛన్ ప్రొసీడింగ్ కాపీలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దివ్యాంగులకు దేశంలో అత్యధికంగా రూ.4016 అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నా ఏ ఒక్క రాష్ట్రంలో దివ్యాంగులకు ఇంత పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. ఇతర రాష్ర్టాల కన్నా ఎక్కువ పింఛన్ ఇస్తున్నా మన దగ్గర కొంత మంది నాయకులు పనిగట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి దివ్యాంగులకు అండగా ఉండాలని పింఛన్ను పెంచి ఇస్తున్నారన్నారు.
కామారెడ్డి జిల్లాలో మొత్తం 18,693 మంది దివ్యాంగులకు నెలకు రూ.7.50 కోట్ల పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. వికలాంగుల పింఛన్ భారీగా పెరగడంతో మామూలు వ్యక్తులు కూడా తమకూ అందజేయాలని అడుగుతున్నారని కానీ శారీరకంగా లోపం ఉండి, సదరం సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రమే దివ్యాంగుల పింఛన్కు అర్హులన్నారు. పింఛన్ మంజూరు చేయిస్తామని ఎవరైనా పైరవీకారులు వస్తే నమ్మవద్దని సూచించారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. మండలంలోని సుమారు 30 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్, జడ్పీటీసీ సభ్యురాలు జన్నూబాయి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మాజీద్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, విండో చైర్మన్లు దివిటి శ్రీనివాస్, గంగారాం, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కంది మల్లేశ్, సర్పంచులు శ్యామల, రాము, బద్యా నాయక్, నాయకులు ప్రతాప్సింగ్, లక్ష్మీనారాయణగౌడ్, మైశాగౌడ్, ఏడె మోహన్, మంగళి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే
పిల్లలకు చదువుతో పాటు క్రీడలూ అంతే ముఖ్యమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీస్టేడియంలో మేజర్ ధ్యానచంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ క్రీడాకారులు, క్రీడాభిమానులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందన్నారు. బాన్సువాడ పట్టణంలో క్రీడాకారుల సౌలభ్యం కోసం అన్ని వసతులతో మినీ స్టేడియాన్ని నిర్మించామని తెలిపారు. క్రీడాకారులు స్టేడియాన్ని సద్వినియో గం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. అ సందర్భంగా క్రీడా పోటీలను ప్రారంభించారు.