CJI : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో విద్యార్థుల నిరసనల కారణంగా పలు మెట్రో స్టేషన్ల (Metro stations) ను మూసివేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం గురువారం సుప్రీంకోర్టు (Supreme Court) కు చేరింది. మెట్రో స్టేషన్ల మూసివేతతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అధ్యక్షుడు వికాస్ సింగ్ (Vikas Singh).. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన సీజేఐ, మధ్యాహ్న భోజన విరామ సమయానికి సమస్య పరిష్కారం కాకపోతే తానే స్వయంగా జోక్యం చేసుకుంటానని హామీ ఇచ్చారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే సోషల్ మీడియా వేదిక ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో గత కొన్ని రోజులుగా సెంట్రల్ ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేస్తున్నారు. ఇవాళ కూడా సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్తో సహా మొత్తం 16 స్టేషన్లలో సేవలను నిలిపివేశారు.
ఈ అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావిస్తూ వికాస్ సింగ్ మాట్లాడారు. ‘సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లోని కీలక మెట్రో స్టేషన్లను మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సమయానికి కోర్టుకు చేరుకోలేకపోతున్నారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన సరైన గుర్తింపు కార్డులు ఉన్నవారిని, రిజిస్ట్రీ సిబ్బందిని సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్లో దిగేందుకు అనుమతించాలి. రైలు దిగిన తర్వాత ఎగ్జిట్ పాయింట్ వద్ద వారిని తనిఖీ చేసి బయటకు పంపవచ్చు’ అని వికాస్ సింగ్ సూచించారు.
ఈ ఆందోళనపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ఈ విషయంపై మెట్రో అధికారులతో మాట్లాడాలని సుప్రీంకోర్టు యంత్రాంగాన్ని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. ‘ఒకవేళ మధ్యాహ్న భోజన సమయానికి మెట్రో స్టేషన్ తెరవకపోతే నేనే స్వయంగా జోక్యం చేసుకుంటా. ఈ రోజు న్యాయవాదులు కోర్టుకు హాజరు కాలేకపోయిన కేసుల్లో ఎలాంటి ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయవద్దని కూడా ఆదేశించాం’ అని సీజేఐ భరోసా ఇచ్చారు. మరోవైపు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు 16 మెట్రో స్టేషన్లు మూసి ఉంటాయని ఢిల్లీ మెట్రో ప్రకటించడంతో ప్రయాణికుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి.