కమ్మర్పల్లి/వేల్పూర్, నవబంర్ 2: బాల్కొండ నియోజకవర్గ రైతులు గతంలో నీళ్లు, కరెంటు కోసం ఎన్నో తిప్పలు పడ్డారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ప్రశాంత్రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఎస్సారెస్పీ పునర్జీవం, ఎత్తిపోతల పథకాలు, వాగులపై ఎక్కడికక్కడ చెక్ డ్యాములు నిర్మించుకోవడంతోపాటు కొత్తగా సబ్స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం నీళ్లు, కరెంటుకు ఏమాత్రం ఢోకా లేదన్నారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో వేముల మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో ఒకప్పుడు బోరు బావుల కింద సాగుకు, ఎత్తిపోత పథకాలకు భయంకరమైన కరెంటు తిప్పలు ఉండేవని గుర్తుచేశారు. సీఎం ఆశీర్వాదంతో రైతుల సమస్యలన్నీ తొలగిపోయాయని తెలిపారు. కొత్తగా 18 సబ్స్టేషన్లను నిర్మించుకొని కరెంటు కష్టాలను శాశ్వతంగా దూరం చేసుకున్నామన్నారు. పునర్జీవ పథకంతో నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యిందని తెలిపారు. వరద కాలువ, కాకతీయ కాలువ నిండు కుండల్లా ఉంటున్నాయన్నారు. లక్ష్మి, గుత్ప, నవాబు తదితర ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఎన్నో చెక్ డ్యాములు నిర్మించుకున్నామని వివరించారు.
నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ దయతో అసాధారణ అభివృద్ధి జరిగిందని వేముల తెలిపారు. రూ. వెయ్యి కోట్లతో బ్రహ్మాండమైన బీటీ రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించుకున్నామని, ఆలయాలు, చర్చిలు, మసీదులను పునరుద్ధరించామని తెలిపారు. అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందించే మ్యానిఫెస్టోను రూపొందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ప్రదాత అయిన కేసీఆరే మళ్లీ సీఎం కావడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి, తనను ఆశీర్వదించేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
బాల్కొండ నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి పనులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్కు మంత్రి విన్నవించారు. చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇప్పుడున్న సిమెంట్ పైప్లైన్ స్థానంలో స్టీల్ పైప్లైన్ ఇవ్వాలని కోరారు. భీమ్గల్ లింబాద్రి గుట్ట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, బాల్కొండను మున్సిపాలిటీగా మార్చాలని, వేల్పూర్కు జూనియర్ కళాశాలను మంజూరు చేయాలని విన్నవించారు. కొత్తగా 5వేల డబుల్ బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి పథకం కింద 10వేల కుటుంబాలకు ఆర్థికసాయం, పీఎఫ్ ఉన్న మహిళలకు బీడీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. రహత్నగర్, వాడి-కొత్తపల్లి, బుస్సాపూర్-కిసాన్నగర్కు విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేయాలని విన్నవించారు. పునర్జీవ పథకంతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకున్నదని, ప్రాజెక్టును టూరిజం స్పాట్గా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేదికపై వేల్పూర్ మాజీ జడ్పీటీసీ రాజేందర్రెడ్డి బీఆర్ఎస్లో చేరగా, మంత్రి కండువా కప్పి ఆహ్వానించారు.