ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో గతంలో బీఆర్ఎస్కు పట్టం కట్టిన ఓటర్లు.. ఈసారి మూడు పార్టీలనూ ఆదరించారు. రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు, మూడుచోట్ల బీజేపీకి, నాలుగు సెగ్మెంట్లలో కాంగ్రెస్ను గెలిపించారు. విజేతల్లో ఆరుగురు కొత్త అభ్యర్థులు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డిలలో బీజేపీ అభ్యర్థులు ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేశ్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందారు. వీరితో పాటు జుక్కల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీనారాయణ, ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన మదన్మోహన్రావు సైతం అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన వారే కావడం గమనార్హం. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి తనకు ఎదురే లేదని నిరూపించుకున్నారు. బాల్కొండ నుంచి బరిలో దిగిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. జుక్కల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న బీఆర్ఎస్.. చివరి రౌండ్లలో వెనుకబడింది. కేవలం 1152ఓట్లతో షిండే ఓడిపోయారు. మూడోసారి గెలుపు ఖాయమనుకున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్.. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
నిజామాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో మూడు పార్టీలకు ప్రాతినిధ్యం దక్కినట్లు అయ్యింది. మొన్నటి వరకు తొమ్మిది నియోజకవర్గాలకు తొమ్మిది స్థానాల్లోనూ బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మూడు పార్టీలకు విజయం దక్కింది. భారత రాష్ట్ర సమితికి రెండు చోట్ల, భారతీయ జనతా పార్టీకి మూడు చోట్ల, కాంగ్రెస్ పార్టీకి నాలుగు చోట్ల విజయం వరించింది. ఆది నుంచి ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజా సమస్యలపై తక్షణం స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలంతా చెమటోడ్చినప్పటికీ ఫలితాలు మాత్రం తారుమారు అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గంలో విజయం వరించినట్లే వచ్చి చేజారింది. కేవలం 11వందల ఓట్ల తేడాతో హన్మంత్ షిండే ఓటమి చెందారు. మొత్తం 19 రౌండ్ల ఫలితాల్లో సగానికి ఎక్కువ రౌండ్లలో ఏకపక్షంగా బీఆర్ఎస్కే లీడ్ దక్కింది. అనుహ్యంగా 15వ రౌండ్ తర్వాత లీడ్ తగ్గుతూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది. చివరాఖరకు జుక్కల్ స్థానం కాంగ్రెస్ పార్టీకి దక్కింది.
ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్పీకర్గా విధులు నిర్వహించిన పోచారం శ్రీనివాస రెడ్డి విజయం సాధించారు. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోచారం శ్రీనివాస రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. సమీప ప్రత్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై అఖండ విజయాన్ని పోచారం నమోదు చేశారు. బాల్కొండలోనూ వేముల ప్రశాంత్ రెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సునీల్ రెడ్డిపై విజయం సాధించారు. రెండు జిల్లాల్లో 9 నియోజకవర్గాలుంటే ఒక్కో జిల్లాలో బీఆర్ఎస్కు ఒక్కో అసెంబ్లీ స్థానం దక్కింది. ఇకపోతే ఇప్పటి వరకు బోణి కొట్టలేని బీజేపీ అనూహ్యంగా 3 స్థానాలు కైవసం చేసుకున్నది. నిజామాబాద్ అర్బన్లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్లో పైడి రాకేశ్ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. వీరంతా అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన వారే కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డాక్టర్ భూపతి రెడ్డి విజ యం సాధించారు. బోధన్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి స్వల్ప ఓట్లతో గెలిచారు. జుక్కల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన లక్ష్మీ కాంతారావు, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు విజయం కైవసం చేసుకున్నారు.
అసెంబ్లీ ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మొత్తం ఆరుగురు కొత్త వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. కాంగ్రెస్ నుంచి నలుగురు గెలిచినప్పటికీ ఇందులో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు అసెంబ్లీకి కొత్తే. ఇందులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి విజయం సాధించిన వారిలో ఆర్మూర్ నుంచి పైడి రాకేశ్ రెడ్డి, జుక్కల్ నుంచి లక్ష్మీ కాంతారావు ఉన్నారు. పలు దఫాలుగా అసెంబ్లీ బరిలో తలపడి తొలిసారి విజయాన్ని దక్కించుకున్న వారిలో నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఉన్నారు. గెలుపొందిన అభ్యర్థులను వారి అభిమానులు, పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున అభినందనల్లో ముంచెత్తారు. మరోవైపు ఆయా చోట్ల భారీ ఊరేగింపులు నిర్వహించారు. విజయాన్ని పెద్ద ఎత్తున బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన శ్రేణులంతా ఆయా నియోజకవర్గాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు.
బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజా నాయకుడిగా చిరస్థాయి గుర్తింపును సాధించుకున్నారు. ఎన్ని రాజకీయ పదవులు అనుభవించినప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రం ఎప్పుడూ తన నియోజకవర్గ ప్రజలను వదిలి వెళ్లేది కాదు. వారంలో సగానికి ఎక్కువ రోజులు ఇక్కడే నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉండడం పోచారం శ్రీనివాస రెడ్డికే చెల్లింది. వ్యవసాయ మంత్రిగా, స్పీకర్గా తెలంగాణ రాష్ట్రంలో కీలక పదవులు అనుభవించిన ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. వ్యవసాయ మంత్రిగా ప్రత్యేక గుర్తింపును పొందారు. రైతుబీమా, రైతుబంధు వంటి పథకాల రూపకల్పనలో సీఎం కేసీఆర్తో పాటు మేథోమధన చర్చల్లోనూ పాల్గొని ఏకంగా లక్ష్మీపుత్రుడిగా కేసీఆర్ ద్వారా పేరొందారు. కేసీఆర్ సహకారంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాన్సువాడ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. ఏకంగా 10వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. చిన్నపాటి గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చి బాన్సువాడ పట్టణాన్ని అభివృద్ధికి కేరాఫ్గా మార్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. ఇందులో 10వేల ఇండ్లను పేదలకు పంపిణీ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను నిర్మించి గిరిజనుల కోసం సాగు నీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేశారు. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయడం పోచారం శ్రీనివాస రెడ్డికి అలవాటు. ప్రజలతో కలిసి మెలిసి ఉండడం, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం ద్వారా పోచారం శ్రీనివాస రెడ్డి అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకొని రికార్డును తిరగరాశారు.