ఓటమి తప్పదన్న నిరాశలో కూరుకుపోయిన హస్తం పార్టీ దారుణాలకు ఒడిగడుతున్నది. ఆ పార్టీ హత్యారాజకీయాలకు ప్రేరేపిస్తున్నది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కార్యకర్తల ద్వారా ప్రత్యర్థులపై దాడులకు కాంగ్రెస్ పార్టీ ఉసిగొల్పుతున్నది. గండివేట్లో జరిగిన కత్తిపోట్ల ఘటనే ఇందుకు నిదర్శనం. ఏకంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడే కత్తితో వీరంగం సృష్టించి ముగ్గురిపై దాడిచేయడం ఆ పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హస్తం పార్టీ ఆగడాలను చూసి జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వారికి అవకాశమిస్తే అరాచకాలు శృతి మించడం ఖాయమని కలవరపడుతున్నారు.
నిజామాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తోంది. ప్రజల్లో వారిపై సానుకూల పవనాలు లేకపోవడంతో ఉద్రిక్తతలను పెంచి పోషించి తద్వారా లబ్ధి పొం దాలని ప్రయత్నిస్తున్నది. ఈ రకంగా హింసాత్మక ఘటనలతో ఎన్నికల్లో రాజకీయ ప్రయోజాన్ని దక్కించుకునేందుకు హస్తం పార్టీ పాకులాడుతున్నది. ఇందుకు కామారెడ్డి జిల్లా గాంధారి మండ లం గండివేట్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన కత్తిపోట్ల ఘటనే సాక్షాత్కారంగా నిలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఏకంగా గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు మైనార్టీ నాయకులపై కత్తితో దాడి చేయడం కలకలం రేపుతున్నది. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో శాంతియుతమైన పరిస్థితిలో ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ చేస్తున్నది. ఎమ్మెల్యే జాజాల సురేందర్ నేతృత్వంలో శ్రేణులతో భారీ మెజార్టీ లక్ష్యంగా దూసుకుపోతుండడం తో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేకపోవడంతో హత్యా రాజకీయాలకు తెరలేపినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా రాజకీయ పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీకి ఆశలు చల్లబడడంతో చేసేది లేక కుట్రలకు తెరలేపినట్లుగా అనుమానాలు బలపడుతున్నాయి. నవంబర్ 30న పోలింగ్ ఉండడంతో సరిగ్గా పది రోజుల ముందు కత్తిపోట్ల ఘటన ఒక మారుమూల పల్లెలో జరగడం అన్నది హస్తం పార్టీ కీలక నేతల ప్రమేయం ఉంటుందన్న అనుమానాలకు దారితీస్తున్నది. సోషల్ మీడియా సంబంధిత అంశాల్లో తలెత్తిన చిన్నపాటి విషయాన్ని ఏకంగా ప్రాణాలు తీసేంతగా మార్చడం అన్నది కాంగ్రెస్ పార్టీ నేతల ప్రోద్బలం ఉందన్నది ప్రజల్లో చర్చ జరుగుతున్నది.
కత్తిపోట్ల ఘటనలో భీందాస్ చేతిలో బీఆర్ఎస్ మైనార్టీ నేతలు హైమద్, జావిద్, రజాక్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఎమ్మెల్యే జాజాల క్షతగాత్రులను దవాఖానకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. కాగా హైమద్ ఊపిరితిత్తులకు గాయం కావడంతో ఆపరేషన్ చేశారు. కాంగ్రెస్ చేస్తున్న వికృత క్రీడను ఎమ్మెల్యే జాజాల తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేకనే కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెగబడిందన్నారు. హస్తం పార్టీ ఎంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడినా వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్నే గెలిపిస్తారని చెప్పారు. ఈ హత్యా రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ఘటనపై ప్రజలంతా తీవ్రంగా ఖండిస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం నోరు విప్పలేదు. ఇలాంటి హింసాత్మకమైన ఘటనలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందన్న వాదనకు హస్తం పార్టీ నేతల తీరు బలం చేకూరుస్తున్నది.
గాంధారి,ఎల్లారెడి ్డ19: గండివేట్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై కత్తితో దాడి చేసి గాయపరిచిన కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు భీందాస్పై, బాధితుడు హైమద్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు గాంధారి ఎస్సై ప్రేమ్దీప్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు కామారెడ్డిలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడని, త్వరలోనే అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. గండివేట్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
మైనార్టీలంతా ఏకమై కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతున్నది. ఈ దుస్థితిలోనే హస్తం పార్టీ నేతలంతా ఇలాంటి వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఏకంగా ముగ్గురు మైనార్టీ లీడర్లను కత్తితో పొడవడం అన్నది కాంగ్రెస్ హింసా రాజకీయాలను తేటతెల్లం చేస్తున్నది. కాంగ్రెస్ అవలంబిస్తున్న ఘోరమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలంతా కాంగ్రెస్ చేస్తున్న నీచమైన పనులను ఖండించాలని, ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నాను.
డిచ్పల్లి, నవంబర్ 19: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతల కథనం ప్రకారం.. డిచ్పల్లి మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెంట్రాజ్పల్లి, నాకతండా, వడ్డెరకాలనీ, అమృతాపూర్ గ్రామాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అమృతాపూర్లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొందరు బీజేపీ కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తమపై దాడికి యత్నించారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళ్ల సురేశ్, విజయ్, రమణ, బాలయ్యతోపాటు మరో ఆరుగురు ఒక్కసారిగా తమపై దాడికి యత్నించగా, తన చేతివేలికి గాయమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్ అమృతాపూర్కు వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు సురేశ్, రమణ, బాలయ్య, విజయ్, శ్రీధర్, అర్వింద్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈసీ అనుమతితో నిర్వహించే ర్యాలీలను ఇతర పార్టీల వాళ్లు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు.