వేల్పూర్, జూలై 17: వ్యవసాయానికి ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ మనసులో ఉన్న మాటనే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బయటపెట్టాడని, కాంగ్రెస్ను నమ్మితే మోసపోతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద సోమవారం నిర్వహించిన రైతు నిరసన సభలో ఆయన పాల్గొని మాట్లడారు. 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదని రేవంత్ మాట్లాడడాన్ని బలుపు మాటలుగా అభివర్ణించారు. ఉచిత కరెంట్ ఇస్తే రేవంత్కు, కాంగ్రెస్కు ఏం నష్టమని ప్రశ్నించా రు. 24 గంటల కరెంట్తో రైతులు సంతోషంగా ఉంటే నీకు, నీ పార్టీకి ఎందుకు కడుపుమంట అని, కరెంటు నీ అబ్బ సొత్తా.. కరెంట్ బిచ్చమేస్తున్నావా? నీ కడుపులో కర్షకులపై ఎంత విషముం దో రైతులు గమనిస్తున్నారని విరుచుకుపడ్డారు.
తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లో ఉంటారని అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి విషం కక్కాడని, జానారెడ్డి కూడా అసెంబ్లీలో వ్యతిరేకించారని గుర్తుచేశా రు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో మిగులు విద్యుత్ ఉండగా 8 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నదని, మిగులు విద్యుత్ను అమ్ము కుంటారే కానీ రైతులకు 24గంటల ఉచిత కరెంటు ఇవ్వడానికి మనసు రాదన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కొనే కరెంట్ విషయంలో ప్రైవేట్కు ఇవ్వకుండా.. నేరుగా ప్రభుత్వం నుంచే కొనేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్దని అన్నారు. నాడు 4500 మెగావాట్ల ఉత్పాదన ఉన్న తెలంగాణలో 18 వేల మెగావాట్ల ఉత్పాదన స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. రూ.80వేల కోట్లతో పూర్తయిన కాళేశ్వరానికి రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని విమర్శ లు చేయడం విడ్డూరమన్నారు. మోటర్లకు మీటర్లు పెడతామని బీజేపీ అంటే, ఉచిత విద్యుత్ అవసరం లేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ రెండు పార్టీల వైఖరిపై రైతులో ఆలోచన చేయలని లేకపోతే మోసపోయి గోసపడతామన్నారు.
ఎంపీ అర్వింద్పై మంత్రి వేముల ఫైర్
పసుపు బోర్డు తేకపోతే రాజీనామా చేస్తానని చెప్పి మోసం చేసి దర్జాగా తిరుగుతున్న ఎంపీ అర్వింద్.. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న తమను ఇష్టం వచ్చినట్లు అచ్చోసిన ఆంబోతు మాదిరిగా ఒర్రుతూ మతిలేని ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. నాలుగున్నరేండ్లలో తప్పు చేయని ప్రశాంత్రెడ్డి ఇప్పుడు చేస్తాడా.. ఎన్నికల ముందే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు. డబుల్ బిల్లులని కనీస అవగాహన లేకుండా ఎంపీ మాట్లాడుతున్నారని విమర్శించారు. సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ కింద కేంద్రం రూ.300 కోట్లు కేటాయిస్తే అందులో రూ.70 కోట్లు బాల్కొండ నియోజకవర్గంలోని రోడ్లు, బ్రిడ్జిలకు కేటాయించామన్నారు. ఇది తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. సీబీఐ విచారణే కాదు, అంతకుమించి ఇంకేమైనా ఉంటే దానితో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పనిచేసే వాళ్ల మీద ఈడీ, సీబీఐలను ప్రయోగించడం తప్ప.. వేరే పనిలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రైతు నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగధర్ రెడ్డి, ఎంపీపీ భీమ జమున, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మిట్టపల్లి మహిపాల్, రామన్నపేట్ పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.