Vemula Prashanth Reddy | భీంగల్ : భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షవ్వ అశోక్, కర్నె నరేష్ భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పారు.
అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే తాము కాంగ్రెస్ పార్టీని వీడి, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న బీఆర్ఎస్లో చేరినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసి చౌటపల్లి రవి, మాజీ కౌన్సిలర్ బోదిరే నర్సయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.